మాధవన్ ఇల్లు అమ్ముకున్నాడా?

టాలెంటెడ్ యాక్టర్ మాధవన్ ‘రాకెట్రీ’ కోసం ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలుసు. కెరీర్లో తొలిసారి మెగా ఫోన్ పట్టడమే కాదు.. నిర్మాతగా కూడా మారి ఈ చిత్రాన్ని రూపొందించాడతను. ముందు వేరే దర్శకుడితోనే సినిమా పట్టాలెక్కాల్సి ఉన్నా.. ఏవో కారణాల వల్ల అతను తప్పుకుంటే మాధవన్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇదన్న విషయం తెలిసిందే.

ఆయన జీవితం మీద పరిశోధన చేయడానికి, స్క్రిప్టు సిద్ధం చేయడానికి మాధవన్ చాలా సమయమే వెచ్చించాడు. మేకింగ్ కోసం కూడా బాగానే టైం తీసుకున్నాడు. కరోనా వల్ల సినిమా మరింత ఆలస్యం అయింది. మొత్తంగా నాలుగేళ్ల పాటు ఈ సినిమాకు అంకితమైన మాధవన్‌కు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితమే దక్కింది. సినిమాకు మంచి టాక్ వచ్చింది. వసూళ్లు కూడా బాగానే వచ్చాయి. ఓటీటీ, శాటిలైట్ డీల్స్ కూడా అంచనాలకు మించే వచ్చాయి. 

ఐతే ఈ సినిమాను నిర్మించే క్రమంలో మాధవన్ చాలా త్యాగాలు చేయాల్సి వచ్చిందని, తన ఇల్లు కూడా అమ్ముకోవాల్సి వచ్చిందని ఒక నెటిజన్ చేసిన వ్యాఖ్య చర్చనీయాంశం అయింది. దీని గురించి నెటిజన్లు మాట్లాడుకుంటుండడం, తనను కోట్ చేస్తుండడంతో మాధవన్ స్పందించాడు. తాను ‘రాకెట్రీ’ కోసం ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చిందన్న వార్తల్లో నష్టం లేదని తేల్చేశాడు. ఈ వార్తలు అబద్ధమని పేర్కొంటూ.. ‘రాకెట్రీ’ కోసం పని చేసిన వాళ్లందరూ లాభపడ్డారని, ఈ ఏడాది వారు పెద్ద మొత్తంలో ఆదాయపు పన్ను కూడా కట్టబోతున్నారని మాధవన్ చెప్పడం విశేషం.

నిర్మాతగా తనకు కూడా మంచి లాభాలు వచ్చాయని, తాను నిక్షేపంగా తన సొంత ఇంట్లోనే ఉంటున్నానని, దాన్ని తానేమీ అమ్ముకోలేదని కూడా మాధవన్ స్పష్టం చేశాడు. ఈ స్పందన చూసి మాధవన్ అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారు. దాదాపు రూ.50 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ‘రాకెట్రీ’ థియేట్రికల్ రన్‌లో రూ.50 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసింది. డిజిటల్, శాటిలైట్ రైట్స్ ద్వారా రూ.25-30 కోట్ల దాకా ఈ సినిమా ఆదాయం తెచ్చిపెట్టినట్లు సమాచారం.