అశ్వినీదత్ పంచ్.. ఆమెకేనా?

సీనియ‌ర్ నిర్మాత అశ్వినీద‌త్ ఎంత ఔట్ స్పోకెనో అంద‌రికీ తెలిసిందే. త‌న బేన‌ర్‌కు భారీ విజ‌యాలందించిన మెగాస్టార్ చిరంజీవిని సైతం ఆయ‌న విమ‌ర్శించ‌డానికి వెనుకాడ‌లేదు ఆ మ‌ధ్య‌. ఇక చిన‌జీయ‌ర్ స్వామి విష‌యంలో ఆయ‌న వ్యాఖ్య‌లు ఎంత వివాదాస్ప‌దం అయ్యాయో తెలిసిందే. ఇటీవల టాలీవుడ్ స్ట్రైక్ గురించి కూడా నిర్మొహ‌మాటంగా త‌న అభిప్రాయాలు వెల్ల‌డించి వార్త‌ల్లో వ్య‌క్తి అయ్యారు ద‌త్.

తాజాగా ఒక టీవీ ఛానెల్ ఇంట‌ర్వ్యూ కార్య‌క్ర‌మంలో ప‌లు విష‌యాల‌పై ద‌త్ త‌న‌దైన శైలిలో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా మ‌హాన‌టి సినిమా ప్ర‌స్తావ‌న రాగా.. ఆ సినిమా ఎలా కార్య‌రూపం దాల్చిందో వివ‌రించారు. ఈ క్ర‌మంలో సావిత్రి పాత్ర‌కు ముందు అనుకున్న‌ది కీర్తి సురేష్‌ను కాద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ముందు తాము ఎంచుకున్న న‌టితో వివాదం త‌లెత్తి ఆమెను త‌ప్పించిన‌ట్లు వెల్ల‌డించారు.

ఆ న‌టి ఎవ‌రో చెప్ప‌లేదు కానీ.. ద‌త్ మాట‌ల్ని బ‌ట్టి త‌నెవరో గెస్ చేయ‌డం క‌ష్ట‌మేమీ కాదు. ఆమె ఒక మ‌ల‌యాళ న‌టి అని, త‌ను సావిత్రి పాత్ర చేస్తే క‌చ్చితంగా న్యాయం చేసేద‌ని, త‌న‌కు కూడా మంచి పేరు వ‌చ్చేద‌ని ద‌త్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఐతే క‌థా చ‌ర్చ‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో సినిమాలో తాగుడు సీన్లు ఉంటే తాను చేయ‌న‌ని, వాటిని తీసేయాల‌ని అల్టిమేటం విధించింద‌ని.. ఈ విష‌యం త‌న‌కు తెలిసి స్క్రిప్టు మీద కామెంట్ చేయ‌డానికి ఆమె ఎవ‌రు అని ఆగ్ర‌హించాన‌ని.. ఆమె ఈ సినిమా చేయ‌డానికి వీల్లేద‌ని తేల్చి చెప్పాన‌ని.. దీంతో త‌ర్వాత ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ కీర్తి సురేష్‌ను సంప్ర‌దించాడ‌ని ద‌త్ వెల్ల‌డించారు.

సావిత్రి పాత్ర‌కు కీర్తి అన‌గానే అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయార‌ని, ఆమె ఒక ర‌కంగా సినిమాకు కొత్త‌ద‌నం కూడా తీసుకొచ్చింద‌ని, అద్భుతంగా న‌టించి మెప్పించింద‌ని ద‌త్ అన్నారు. దత్ మాట‌ల్ని బ‌ట్టి మ‌హాన‌టిని వ‌దులుకున్న న‌టి నిత్యా మీన‌న్ అని అర్థ‌మైపోతుంది. ఆమెతో చిత్ర బృందం చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు, ఏవో కారణాల వ‌ల్ల త‌ప్పుకున్న‌ట్లు అప్ప‌ట్లో వార్త‌లు కూడా వ‌చ్చాయి.