పిల్లల్ని కనకపోవడంపై బ్రహ్మాజీ కామెంట్

టాలీవుడ్లో ఎంత వయసు పెరిగినా.. ఆ ప్రభావం అసలు కనిపించని నటుల్లో బ్రహ్మాజీ ఒకడు. అతను 30 ఏళ్ల సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్నాడు టాలీవుడ్లో. ఐతే 90ల్లో ఎలా కనిపించేవాడో ఇప్పటికీ అలాగే దర్శనమిస్తున్నాడు. మంచి నటుడైనప్పటికీ హీరోగా చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్నివ్వకపోవడంతో క్యారెక్టర్ నటుడిగా స్థిరపడాల్సి వచ్చింది.

గత కొన్నేళ్లలో అదిరిపోయే ఫన్నీ క్యారెక్టర్లతో బ్రహ్మాజీ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ గమనం గురించి, అలాగే వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు బ్రహ్మాజీ. ‘సింధూరం’లో హీరోగా నటించిన తనకు మంచి పేరు వచ్చినప్పటికీ.. తర్వాతి పదేళ్లు తాను స్ట్ర్రగుల్ ఎదుర్కొన్నట్లు అతను చెప్పాడు. హీరోగా అవకాశాలు రాక, అవి కాక ఏం చేయాలో తెలియక తాను అయోమయానికి గురైనట్లు బ్రహ్మాజీ చెప్పాడు. కానీ తర్వాత క్యారెక్టర్, నెగెటివ్ రోల్స్‌తో తన కెరీర్ కొత్త మలుపు తీసుకుందన్నాడు.

‘శంకరాభరణం’ తనపై విపరీతమైన ప్రభావం చూపిందని, ఆ సినిమాలో లీడ్ రోల్ చేసిన సోమయాజులు గారు తమ ఊరికి వచ్చినపుడు పెద్ద సన్మానం చేశారని, ఆయనకు వచ్చిన పేరు ప్రఖ్యాతులు చూసి తాను తాను నటుడిగా మారాలని నిర్ణయించున్నానని.. ఐతే పెద్దగా కష్టాలు పడకుండానే తాను పరిశ్రమలో నిలదొక్కుకున్నానని బ్రహ్మాజీ వెల్లడించాడు. ఇప్పుడు వైవిధ్యమైన, ఫన్ టచ్ ఉన్న క్యారెక్టర్ రోల్స్‌తో తాను చాలా బిజీగా ఉన్నట్లు తెలిపాడు.

ఇక వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ.. ‘‘నేను ఓ బెంగాలీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. నేను చెన్నైలో ఉన్నపుడే తనతో పరిచయం జరిగి ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి ఆమెను పెళ్లి చేసుకున్నా. ఐతే నేను ఆమెను పెళ్లి చేసుకునే సమయానికే ఆల్రెడీ పెళ్లయి విడాకులు తీసుకున్నారు. తనకో కొడుకు కూడా ఉన్నాడు. అప్పటికే కొడుకు ఉండగా మళ్లీ పిల్లల్ని కనాల్సిన అవసరం ఏముంది అనుకున్నాం. తననే నా కొడుకుగా స్వీకరించాను. అతనే పిట్టకథ సినిమాతో హీరోగా టాలీవుడ్లోకి అడుగు పెట్టాడు’’ అని బ్రహ్మాజీ వెల్లడించాడు.