ప్రభాస్ చేయాల్సిన సినిమాలో ఎన్టీఆర్!

ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే సినీ ప్రముఖుల్లో ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ ఒకరు. ఏదీ దాచి పెట్టుకోకుండా.. విషయం ఏదైనా సరే నిర్మోహమాటంగా చెప్పేసే ఆయన.. తాజాగా మాంచి ఖుషీలో ఉన్నారు. ఆయన కుమార్తె నిర్మించిన సీతారామం మూవీ పెద్ద సక్సెస్ కావటం.. దానికి మించిన ఈ సినిమా టాలీవుడ్ లోనే అతి పెద్ద క్లాసిక్ లవ్ స్టోరీగా విమర్శకులు సైతం ప్రశంసలు ఇస్తున్న వైనానికి ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

ఈ సందర్భంగా చెబుతున్న మాటలు ఇండస్ట్రీతో పాటు.. మిగిలిన వారిని సర్ ప్రైజ్ చేస్తున్నారు. ఇంతకాలం బయటకు రాని విషయాలు సైతం ఇప్పుడు బయటకు వస్తున్నాయి. తాను నిర్మించిన స్టూడెంట్ నెంబర్ 1 మూవీకి తొలుత డార్లింగ్ ప్రభాస్ ను అనుకున్న విషయాన్ని చెప్పారు. మరి.. తారక్ కెరీర్ లో అతి పెద్ద సక్సెస్ గా నిలిచిన ఈ మూవీకి ప్రభాస్ ప్లేస్ లో జూనియర్ ఎన్టీఆర్ ఎలా వచ్చారంటే.. దానికి కారణాన్ని చెప్పేశారు. తారక్ తండ్రి హరిక్రిష్ణ తనకు ఫోన్ చేయటంతో.. ఆ సినిమాలో ప్రభాస్ ప్లేస్ లో తారక్ ను ఎంపిక చేసినట్లు చెప్పారు.

తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన పెళ్లి సందడి సినిమా తర్వాత తాను.. అల్లు అరవింద్ ఇద్దరం కలిసి చిరంజీవి హీరోగా నటించిన ‘చూడాలని ఉంది’ మూవీని హిందీలో అనిల్ కపూర్ తో తీశామని.. ఆ సినిమా కారణంగా తమ ఇద్దరికి చెరో రూ.6 కోట్లు చొప్పున పోయిన విషయాన్ని చెప్పుకొచ్చారు. తన కెరీర్ లో బాగా నిరాశ పరిచిన మూవీ శక్తిగా చెప్పారు. అప్పట్లో తాను ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చారు.

ఆయన చెప్పిన కబుర్లలో మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్.. వాణిశ్రీ తో కలిసి ఒక మూవీకి ప్లాన్ చేశామని.. వాణిశ్రీని సంప్రదించగా రూ.2లక్షలు కావాలని డిమాండ్ చేశారన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘వాణిశ్రీనే రూ.2లక్షలు అడిగినప్పుడు.. ఎన్టీఆర్ మరింత ఎక్కువ అడుగుతారుకదా? అని మరో రూ.50వేలు ఎక్కువగా చేసి రూ.2.5లక్షలు ఒక పాకెట్ లో తీసుకెళ్లి ఇచ్చా. దాన్ని చూసిన ఆయన.. అదేంది బ్రదర్ నేను తీసుకునేది రూ.2లక్షలే కదా? మిగిలిన రూ.50వేలు వద్దంటూ.. తిరిగి ఇచ్చేశారు. ఎన్టీఆర్ అలా ఉండేవారు’ అంటూ నాటి సంగతుల్ని చెప్పుకొచ్చారు. ఇప్పటి టాప్ హీరోలు సినిమా హిట్ అయితే చాలు.. రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసే తీరుతో పోలిస్తే.. సీనియర్ ఎన్టీఆర్ ఎన్ని రెట్లు బెటర్ అంటారు?