ట్రెండ్ సెట్ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్

సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ ఇప్పుడు మామూలు హైలో లేరు. ఆగస్టు 9న మహేష్ పుట్టిన రోజును నెవర్ బిఫోర్ అన్నట్లుగా చేయడానికి వాళ్లు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద హీరోల పుట్టిన రోజులప్పుడు వారి కెరీర్లలో బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచిన సినిమాలను హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో స్పెషల్ షోలుగా వేయడం మామలే కానీ.. అవి ఒకట్రెండు షోలకే పరిమితం అవుతుంటాయి.

కానీ ఈసారి మహేష్ ఫ్యాన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో ఒక్కడు, పోకిరి సినిమాల స్పెషల్ షోలు ప్లాన్ చేశారు. మహేష్ బర్త్‌డేకి పది రోజుల ముందే రాజమండ్రిలో ‘ఒక్కడు’ స్పెషల్ షోతో సంబరాలు మొదలుపెట్టేశారు. ఆ షోకు వచ్చిన రెస్పాన్స్ చూసి అందరూ షాకవుతున్నారు. ఏదో కొత్త సినిమా రిలీజైన తరహాలో దానికి హంగామా నడిచింది. మిగతా షోల్లో ఇంతకుమించిన హంగామా గ్యారెంటీ అనిపిస్తోంది.

ఎక్కడిక్కడు ఈ షోలకు టికెట్లు అమ్మకానికి పెడితే హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యుఎస్‌లో సైతం రెండంకెల సంఖ్యలో షోలు ప్లాన్ చేశారు. ఇటీవలే ఒక ఏరియాలో ‘పోకిరి’ షోకు టికెట్లు అమ్మకానికి పెడితే గంటలో అమ్ముడైపోయాయి. ఈ ఊపు చూసి మరిన్ని షోలు ప్లాన్ చేశారు. ఈ స్పెషల్ షోల విషయంలో అత్యధిక వసూళ్ల రికార్డు ఆల్రెడీ మహేష్ సొంతం అయిపోయింది. యుఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే 4 వేల డాలర్లకు పైగా వసూలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని షోల తాలూకు గ్రాస్ తీస్తే పెద్ద అమౌంటే అయ్యేలా కనిపిస్తోంది.

ఈ డబ్బులన్నీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల ఖాతాలోకి ఏమీ వెళ్లట్లేదు. హక్కుల కోసం నామమాత్రంగా చెల్లించి.. థియేటర్లకు అద్దెలు ఇచ్చి.. మిగతా వసూలైన డబ్బు మొత్తాన్ని మహేష్ బాబు పేరిట ఉన్న ఫౌండేషన్ ద్వారా చిన్నపిల్లల హార్ట్ ఆపరేషన్లకు ఉపయోగించనున్నారట. ఈ విషయమై అధికారిక ప్రకటన కూడా చేశారు. ఈ నిర్ణయం అందరి ప్రశంసలు అందుకుంటోంది. స్పెషల్ షోల ప్లానింగ్, వాటి నుంచి వచ్చే డబ్బుల వినియోగంలో మహేష్ ఫ్యాన్స్ ట్రెండ్ సెట్ చేస్తున్నారనే చెప్పాలి.