లాల్ సింగ్ వివాదం – అక్షయ్‌కు లాభం

ఇంకో తొమ్మిది రోజుల్లో విడుదల కాబోతున్న లాల్ సింగ్ చడ్డా ఊహించని ఉత్పాతాన్ని ఎదురుకుంటోంది. ఎప్పుడో 2015లో అమీర్ ఖాన్ చేసిన యాంటీ ఇండియన్ కామెంట్స్ ని ఇప్పుడు బయటికి తీసి ఈ సినిమాను బ్యాన్ చేయాల్సిందిగా నెటిజెన్లు దాన్నో ట్రెండ్ గా మార్చేయడంతో అభిమానులతో పాటు సినిమా టీమ్ విపరీతమైన ఆందోళనకు గురవుతోంది. భారతదేశంలో తమకు పిల్లలకు రక్షణ లేదన్నట్టుగా అమీర్ చేసిన వ్యాఖ్యలతో పాటు ఇందులో భార్యగా నటించిన కరీనా కపూర్ గతంలో కొడుకు తైమూర్ విషయంలో అన్న మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

ఇప్పుడిదంతా లాల్ సింగ్ కొంపముంచేలా ఉంది. అమీర్ ఖాన్ స్వయంగా రంగంలోకి దిగి వివరణ ఇచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నా సదరు వర్గం ప్రేక్షకులు శాంతించడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో లాల్ సింగ్ చడ్డా చూసే ప్రసక్తే లేదని చెబుతున్నారు. వాళ్ళు చూడకపోతే పోనీ చూసేవాళ్లను సైతం ప్రభావితం చేసేలా క్యాంపైన్ మొదలుపెట్టడం అసలు ట్విస్ట్. థగ్స్ అఫ్ హిందుస్థాన్ వచ్చినప్పుడూ అమీర్ కు ఈ సెగలు తప్పలేదు. కాకపోతే అందులో అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారు కాబట్టి ట్రోలింగ్ ఒకదశకు ఆగిపోయింది.

ఇప్పుడీ వ్యవహారం అక్షయ్ కుమార్ కు మేలు చేసేలా కనిపిస్తోంది. అదే రోజు ఆగస్ట్ 11 తన రక్షాబంధన్ రిలీజవుతున్న సంగతి తెలిసిందే. పక్కా సిస్టర్ సెంటిమెంట్ తో ఎంటర్ టైన్మెంట్ రంగరించి రూపొందిన ఈ ఎమోషనల్ డ్రామాకు లాల్ సింగ్ ని వ్యతిరేకించే వాళ్లంతా మద్దతుగా నిలవడం అసలు ట్విస్ట్.ఇదంతా ఓపెనింగ్స్ విషయంలో ప్రభావితం కలిగించే అంశమే. యుననిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే అమీర్ కు టెన్షనేమీ ఉండదు కానీ ఎటొచ్చి యావరేజ్ అన్నా సరే చిక్కులు తప్పవు. మరి ఊహించని ఈ ఛాన్స్ ని అక్షయ్ ఎలా వాడుకుంటాడో రక్షాబంధన్ లోని కంటెంట్ ని బట్టి ఉంటుంది.