మెగాస్టార్ మళ్ళీ లీకులు ఇచ్చారు

స్టేజి మీద లేదా నలుగురి మధ్య ఉన్నప్పుడు రాబోయే సినిమాల గురించి లీకులు ఇవ్వడం మెగాస్టర్ చిరంజీవికి ఈ మధ్య అలవాటుగా మారిపోయింది. దీని మీద సోషల్ మీడియాలో చాలా మీమ్స్ కూడా వచ్చాయి. రంగస్థలంలో ఆది పినిశెట్టి క్యారెక్టర్ చనిపోవడంతో మొదలుపెట్టి ఆచార్య టైటిల్ ని టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేయడానికి ముందే లీక్ చేయడం దాకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. తెలుగు వెర్షన్ కి తాను సమర్పకుడిగా వ్యవహరిస్తున్న లాల్ సింగ్ చడ్డా ప్రెస్ మీట్ లో మరోసారి ట్విస్టు ఇచ్చేశారు.

సినిమాలోని కంటెంట్ ని గొప్పగా పొగిడే క్రమంలో లాల్ సింగ్ చడ్డాని చాలా ఓపిగ్గా చూడాలని అలా అయితేనే అందులో ఎమోషన్స్ బాగా కనెక్ట్ అవుతాయని మైక్ ముంచు చెప్పేశారు. అయినా ప్రేక్షకులు థియేటర్లో కూర్చునేది ఓపికతో కాదుగా.. సరదాగా టైం పాస్ కావాలని లేదా మంచి ఎంటర్ టైన్మెంట్ దొరుకుతుందని. అంతే తప్ప తమ సహనానికి పరీక్ష పెట్టే కళాఖండాలకు ఈ మధ్య ఎన్ని వాతలు పెట్టారో ఆచార్య నుంచి థాంక్ యు దాకా ఎన్నో చూస్తున్నాం. అయినా ఇలా ఓపిక పదాన్ని నొక్కి చెప్పడమే ఏదో ల్యాగ్ ఉందన్న అనుమానం కలిగిస్తోంది.

అసలే అమీర్ ఖాన్ ఎన్నడూ లేనిది లాల్ సింగ్ కోసం హైదరాబాద్ కు పదే పదే వస్తున్నాడు. గతంలో మంగళ్ పాండే, దంగల్ లాంటివి తెలుగులో డబ్ అయినప్పటికీ ఈ వర్సటైల్ యాక్టర్ ఏనాడూ మన మీడియా ముందుకు రాలేదు. కానీ లాల్ సింగ్ ని మాత్రం చాలా పర్సనల్ గా తీసుకుని ఇక్కడ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, ప్రీమియర్లు వేస్తున్నాడు. ఇలాంటి టైంలో చిరంజీవి ప్రత్యేకంగా ఓపిక, హై ఎమోషనల్, కన్నీళ్లు వస్తాయని చెప్పడం చూస్తే వినోదం మాత్రమే ఆశించే సగటు ప్రేక్షకులు దీని వైపు చూడకపోయే రిస్క్ ఉంది. ఏమైనా తాను మొదటిసారి సమర్పకుడి వ్యవహరిస్తున్నాడు కాబట్టి మెగాస్టార్ ఈ లాల్ సింగ్ ని ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తున్నారు .