రామారావు ద‌ర్శ‌కుడి ట్విట్ట‌ర్ పంచ్


రామారావు-ఆన్ డ్యూటీ చిత్రంతో టాలీవుడ్లో ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేస్తున్నాడు శ‌ర‌త్ మండ‌వ‌. త‌న సినిమా విడుద‌ల నేప‌థ్యంలో ఓ ఇంట‌ర్వ్యూలో వెబ్ మీడియా హ‌డావుడి రివ్యూల గురించి అత‌ను చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. యుఎస్‌లో ప్రిమియ‌ర్ షోలు ప‌డ‌డం ఆల‌స్యం రివ్యూలు ఇవ్వ‌డాన్ని అత‌ను త‌ప్పుబ‌ట్టాడు. ఇప్పుడు రామారావు-ఆన్ డ్యూటీ ప్రి రిలీజ్ ఈవెంట్లో శ‌ర‌త్ వ్యాఖ్య‌లు మ‌ళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి.

అత‌ను కొత్త సినిమాలు రిలీజైన‌పుడు ట్విట్ట‌ర్లో వ‌చ్చే షార్ట్ రివ్యూలు, ఫీడ్ బ్యాక్ విష‌యంలో ఒకింత అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. ట్విట్ట‌ర్లో ట్వీట్లు చూసి సినిమాలకు వెళ్లొద్ద‌ని అత‌ను ప్రేక్ష‌కుల‌ను కోరాడు. పిట్ట‌లు రెట్ట‌లు మాత్ర‌మే వేస్తాయ‌ని.. అందులో మంచి ఏమీ ఉండ‌ద‌ని.. సినిమాల గురించి ఇక్క‌డ చాలా మంది కావాల‌నే నెగెటివ్ ట్వీట్లు వేస్తుంటార‌ని.. కాబ‌ట్టి వాటిని న‌మ్మి సినిమాల విష‌యంలో ఒక నిర్ణ‌యానికి రావ‌ద్ద‌ని శ‌ర‌త్ పేర్కొన్నాడు. నేరుగా థియేట‌ర్ల‌కు వెళ్లి సినిమా చూడాల‌ని.. అలా కాకుంటే రిలీజ్ రోజు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు ఆగాల‌ని.. సినిమా అస‌లు ఫ‌లితం ఏంటో అప్పుడు తెలుస్తుంద‌ని.. సినిమా బాగా లేదంటే చూడాల్సిన అవ‌స‌రం లేద‌ని శ‌ర‌త్ అన్నాడు.

ఇక త‌న సినిమా టికెట్ ధ‌ర‌ల గురించి మ‌ట్లాడుతూ.. తెలంగాణ‌లో సింగిల్ స్క్రీన్ల‌లో 150, మ‌ల్టీప్లెక్సుల్లో రూ.195గా రేట్లు ఫిక్స్ చేశార‌ని.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ధ‌ర‌లు ప్ర‌భుత్వం చేతుల్లో ఉంటాయ‌ని.. అక్క‌డ సింగిల్ స్క్రీన్ల‌లో 147, మ‌ల్టీప్లెక్సుల్లో రూ.177తో టికెట్లు అమ్ముతార‌ని శ‌ర‌త్ ప్ర‌క‌టించాడు. ఆన్ లైన్లో టికెట్లు కొంటే అద‌నంగా రూ.30 చెల్లించాల్సి ఉంటుంద‌ని.. అలా మ‌ధ్య‌వ‌ర్తుల‌కు డ‌బ్బులు ఇవ్వ‌డం ఎందుక‌ని.. కొంచెం క‌ష్ట‌ప‌డి థియేట‌ర్ల‌కు వెళ్లి అక్క‌డే టికెట్లు తీసుకుని ఎగ్జిబిట‌ర్ల‌కు ప్ర‌యోజ‌నం చేకూర్చాల‌ని శ‌ర‌త్ పిలుపునివ్వ‌డం విశేషం. రామారావు-ఆన్ డ్యూటీ ట్రైల‌ర్లో మంచి సౌండ్ ఉంద‌నుకుంటే.. సినిమా ఇంకా లౌడ్‌గా ఉంటుంద‌ని శ‌ర‌త్ అన్నాడు.