బాహుబలి మత్తులోనే బాలీవుడ్

అందరు దర్శకులు ఒకేలా ఆలోచించి సినిమాలు తీయగలిగితే రాజమౌళి ప్రత్యేకత ఏముంటుంది. అందుకే ఆయన ఇండియన్ స్పిల్ బర్గ్ అయ్యారు. ఎప్పుడైతే బాహుబలి జాతీయ హద్దులను చెరిపేసి ఇంటర్నేషనల్ లెవెల్ లో వేల కోట్లు వసూలు చేసి ఖ్యాతి సంపాదించుకుందో అప్పటి నుంచి బాలీవుడ్ మేకర్స్ దాన్ని తలదన్నే ప్యాన్ ఇండియా మూవీని తీయాలనే దుగ్దతో మళ్ళీ మళ్ళీ చేతులు కాల్చుకుంటున్నారు. నిన్న షంషేరాని చూస్తే అదే అర్థమవుతుంది.

రన్బీర్ కపూర్ ని డ్యూయల్ రోల్ లో చూపించడంతో మొదలుపెట్టి గ్రాండియర్ తప్ప కంటెంట్ కు సంబంధించిన ఎలాంటి హోమ్ వర్క్ లేకుండా వందల కోట్లను వృధా చేశారు. అయినా ఇది మొదటిసారి కాదు. ఇప్పటికి చాలా ప్రయత్నాలు జరిగాయి. అమీర్ ఖాన్ అమితాబ్ బచ్చన్ లతో థగ్స్ అఫ్ హిందుస్థాన్ చూస్తే ఇప్పటికీ అత్యంత చెత్త సినిమాల్లో దాని స్థానం టాప్ 5లో పదిలంగా ఉంది. సంజయ్ దత్ అర్జున్ కపూర్ లాంటి క్యాస్టింగ్ తో పానిపట్ అనే వార్ మూవీ తీస్తే పట్టుమని పదిరోజులు కాకుండానే చేతులెత్తేసింది.

మన క్రిషే తీసిచ్చిన మణికర్ణిక సైతం అద్భుతాలేమి చేయలేదు. కంగనా చేతుల్లోకి వెళ్ళాక మరింత బ్యాడ్ అయ్యిందే తప్ప వచ్చిందేమీ లేదు. కళంక్ అనే మరో కళాఖండం వచ్చింది.అందులో వరుణ్ ధావన్ ఎద్దుతో తలపడే సన్నివేశం బాహుబలిలో రానాని చూసి ఎత్తుకొచ్చిందే. ఆ బొమ్మ ఫలితం మెగా డిజాస్టర్. చెప్పుకుంటూ పొతే చాలా ఉదాహరణలే కనిపిస్తాయి. కేవలం హంగులకు మాత్రమే ప్రాధాన్యమిచ్చి ఎమోషన్లను గాలికి వదిలేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది.

జక్కన్న ఒక సినిమా మీద ఎందుకు మూడు నాలుగేళ్లు తీసుకుంటారనే విషయాన్ని స్టడీ చేసినా చాలు కనీసం ఆయన స్టాండర్డ్ లో సగం అందుకోవచ్చు. లేదంటే ఇలాంటి ఫలితాలు రిపీట్ అవుతూనే ఉంటాయి. తమిళంలో ఇదే తరహాలో చేయబోయి విజయ్ అంతటి స్టార్ హీరోనే పులి రూపంలో షాక్ తిన్నాడు. శ్రీదేవి, సుదీప్ లాంటి క్యాస్టింగ్ ఉన్నా లాభం లేకపోయింది. రాబోయే మణిరత్నం పొన్నియన్ సెల్వన్ 1 బాహుబలిని మరిపించేలా ఏదైనా మేజిక్ చేసిందా సరేసరి లేదంటే అంతే సంగతులు.