ఒక్క థియేట‌ర్ మీద ఇంత గొడ‌వా?

నిజామాబాద్‌లో న‌ట‌రాజ్ అనే ఒక సింగిల్ స్క్రీన్. దాని లీజ్ మార్పు గొడ‌వ టాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నిజామాబాద్ ఎస్వీసీ అధినేతలు దిల్ రాజు, శిరీష్‌ల సొంత న‌గ‌రం అన్న సంగ‌తి తెలిసిందే. అక్క‌డ సింగిల్ స్క్రీన్లు ఎస్వీసీతో పాటు ఏషియ‌న్ వారి చేతుల్లో ఉన్నాయి. ఐతే ఇప్పుడు ఉన్న‌ట్లుండి ఆ థియేట‌ర్ల లీజు చేతులు మారి మైత్రీ మూవీ మేక‌ర్స్ వారి చెంత‌కు చేరిన‌ట్లు తెలుస్తోంది.

ఐతే ఎన్నో ఏళ్ల నుంచి త‌మ వ‌ర్గం చేతుల్లో ఉన్న న‌ట‌రాజ్ థియేట‌ర్‌ను మైత్రీ వాళ్ల‌కు ఇచ్చేయ‌డంపై ఆగ్ర‌హం చెందిన దిల్ రాజు, శిరీష్‌.. ఆ థియేట‌ర్‌కు తాళాలు వేసి యాజ‌మాన్యాన్ని బెదిరించిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కుముందున్న లీజ్ అగ్రిమెంట్ ముగిసింద‌ని.. తాము చెప్పిన రేటు, కండిష‌న్ల‌కు అంగీక‌రించిన మైత్రీ సంస్థ‌తో తాము కొత్త‌గా అగ్రిమెంట్ చేసుకున్నామ‌ని.. దీన్ని అడ్డుకుంటూ బెదిరిస్తున్నార‌ని న‌ట‌రాజ్ థియేట‌ర్ య‌జ‌మానులు మీడియా ముందు గోడు వెళ్ల‌బోసుకోవ‌డంతో ఈ వార్త టాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

తెలంగాణ‌లోని సింగిల్ స్క్రీన్లకు సంబంధించి ఆధిప‌త్య‌మంతా ఎస్వీసీ, ఏషియ‌న్ సంస్థ‌ల‌దే. ఇటీవ‌ల సింగిల్ స్క్రీన్ల‌లో ప‌ర్సంటేజీ విధానాన్ని అమ‌లు చేయాలంటూ ఎగ్జిబిట‌ర్లు గొడ‌వ చేయ‌డం వెనుక ఈ సంస్థ‌ల అధినేత‌లే ఉన్నారని. త‌మ నిర్మాణంలో వ‌స్తున్న‌ పెద్ది సినిమాకు ఇబ్బందులు సృష్టించ‌డానికే ఇలా చేస్తున్నార‌ని మైత్రీ అధినేత‌లు ఆరోపిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి జోక్యంతో థియేట‌ర్ల గొడ‌వ తాత్కాలికంగా స‌ద్దుమ‌ణిగింద‌ని, పెద్దికి ఇబ్బంది ఉండ‌క‌పోవ‌చ్చ‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇంత‌లో మైత్రి సంస్థ రాజు, శిరీష్‌ల ఇలాఖాలో సింగిల్ స్క్రీన్ల‌ను చేజిక్కించుకునే ప్ర‌య‌త్నం చేయ‌డంతో కొత్త వివాదం ముసురుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఈ ప‌రిణామాన్ని రాజు, శిరీష్ జీర్ణించుకోలేక‌పోతున్న‌ట్లుగా చెబుతున్నారు. పెద్ది విడుద‌ల‌కు నాలుగు రోజుల ముందు త‌లెత్తిన ఈ వివాదం.. ఎలాంటి మ‌లుపు తీసుకుంటుందో, ఆ సినిమా విడుద‌ల‌కు ఇది అడ్డంకిగా మారుతుందేమో అని ఇండ‌స్ట్రీలో ఆస‌క్తిగా చ‌ర్చించుకుంటున్నారు.