దిల్ రాజు సేఫ్

సినీ రంగంలో అసలే సక్సెస్ రేట్ అంతంతమాత్రం. కొవిడ్ తర్వాత పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారి సక్సెస్ రేట్ ఇంకా పడిపోతోంది. వేసవిలో బాగానే కళకళలాడిన థియేటర్లు గత నెల రోజులుగా వెలవెలబోతున్న సంగతి తెలిసిందే. ప్రతి వారం కొత్త సినిమా మీద ఆశలు పెట్టుకోవడం.. అది బోల్తా కొట్టడం.. ఇదీ వరస. అంటే సుందరానికీ, విరాటపర్వం, పక్కా కమర్షియల్, ది వారియర్.. ఇలా గత నెల రోజుల్లో రిలీజైన ఏ పేరున్న సినిమా కూడా ఆకట్టుకోలేదు. ట్రేడ్ ఆశలన్నీ గల్లంతయ్యాయి.

ఇప్పుడు ‘థాంక్యూ’ మీద ఆశలు పెట్టుకుంటే దాని పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు. ‘మనం’ లాంటి క్లాసిక్ తర్వాత విక్రమ్ కుమార్-నాగచైతన్య కలయికలో తెరకెక్కిన సినిమా కాబట్టి కచ్చితంగా ప్రత్యేకంగా ఉంటుందని అనుకున్నారు. కానీ విక్రమ్ కెరీర్లోనే వీకెస్ట్ ఫిలిం అనే టాక్ వినిపిస్తోంది సినిమా గురించి. అసలే గురువారం రాత్రి నుంచి మళ్లీ వర్షాలు మొదలవడం, దీనికి తోడు డివైడ్ టాక్.. ఈ నేపథ్యంలో ‘థాంక్యూ’ పరిస్థితి ఏమవుతుందో చూడాలి.

ఐతే ‘థాంక్యూ’తో దిల్ రాజుకు పెద్ద బాధేమీ లేదన్నది ఆయన సన్నిహిత వర్గాల టాక్. విడుదలకు ముందే ఆయన సేఫ్ అయిపోయారట. సినిమాను పరిమిత బడ్జెట్లోనే పూర్తి చేయడం.. సోనీ లివ్‌కు రూ.12 కోట్లకు డిజిటల్ రైట్స్ అమ్మేయడం.. శాటిలైట్ కూడా పూర్తయిపోవడంతో వాటి రూపంలోనే ఆయన బడ్జెట్ మొత్తం రికవర్ చేసేసినట్లు తెలిసింది. తన రెగ్యులర్ బయ్యర్లకు తక్కువ రేట్లకే సినిమాను అమ్మారట. తన గత చిత్రం ‘ఎఫ్-3’ కొంత మేర బయ్యర్లకు నష్టాలు మిగల్చడంతో వారికి నామమాత్రపు ధరలకు ‘థాంక్యూ’ని ఇచ్చినట్లు సమాచారం.

ఫస్ట్ కాపీ చూశాక రాజుకు.. ఈ సినిమా అద్బుతాలు చేస్తుందన్న ఆశలేమీ లేవని.. అందుకే ప్రమోషన్ల పరంగా ఎప్పుడూ ఉండే దూకుడు చూపించలేదని.. సినిమా గురించి మరీ ఎక్కువ చెప్పి క్రెడిబిలిటీ దెబ్బ తీసుకోవడం ఎందుకని ఊరుకున్నారని సమాచారం. తొలి వీకెండ్ వరకు సినిమా ఓ మోస్తరుగా నడిస్తే బయ్యర్లు కూడా సేఫ్ అయిపోతారని తెలుస్తోంది. కానీ టాక్ చూస్తే వీకెండ్లోనూ సినిమా నిలబడుతుందా లేదా అన్న సందేహాల కలుగుతున్నాయి.