చై-సామ్.. ఒక ఇంటి కథ

టాలీవుడ్ చరిత్రలోనే మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్స్ జాబితా తీస్తే నాగచైతన్య-సమంతల జంట పేరు కచ్చితంగా ఉంటుంది. వీరి ప్రేమాయణం గురించి వార్తలు బయటికి వచ్చినప్పటి నుంచి మీడియాలో జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. కారణాలేంటన్నది పక్కన పెడితే ఈ జంట అందరికీ చూడముచ్చటగా అనిపించింది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అనిపించుకున్నారు అందరితోనూ. పెళ్లి జరిగినపుడు, ఆ తర్వాత చూసేవాళ్లందరికీ ఈ జంట చాలా అన్యోన్యంగా కనిపించింది. అలాంటి జంట పెళ్లయి నాలుగేళ్లు తిరక్కముందే విడాకులు తీసుకోవడం అందరికీ పెద్ద షాక్. కొంతమంది ఇంకా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

సోషల్ మీడియాలో ఇటు చైతూకు, అటు సమంతకు.. మళ్లీ కలిసిపోవాలని మెసేజ్‌లు పెట్టే వాళ్లు చాలామందే ఉన్నారు. ఐతే సామాన్యులే కాదు.. మురళీ మోహన్ లాంటి సినీ లెజెండ్ సైతం తనకు కాస్త ముందుగా విడాకుల గురించి తెలిస్తే ఇద్దరితో కలిసి మాట్లాడేవాడినని వ్యాఖ్యానించడం విశేషం. చైతూ-సామ్ తన ఇంట్లోనే ఉండేవారని వెల్లడిస్తూ.. ఆ ఇంటికి సంబంధించి ఆసక్తికర విశేషాలను ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

‘‘హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లో మాకు కొన్ని అపార్ట్‌మెంట్లున్నాయి. వాటిలో మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన మూడు ఇళ్లు నిర్మించుకున్నాం. ఒకసారి చైతూ-సమంత మా అపార్ట్‌మెంట్స్ చూడడానికి వచ్చారు. మేం ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్న ఇళ్లలో ఒకటి వాళ్లిద్దరికీ బాగా నచ్చింది. అది తమకు కావాలని అడిగారు. కానీ నేను ఒప్పుకోలేదు. దీంతో వాళ్లు కొంత నిరాశకు గురయ్యారు. కానీ కొన్ని రోజుల తర్వాత నాగార్జున నన్ను అడిగితే కాదనలేక ఆ మూడు ఇళ్లలో ఒకటి చైతన్యకు ఇచ్చాను.

పెళ్లయ్యాక చైతూ, సామ్ ఆ ఇంట్లోనే ఉన్నారు. చాలా చూడముచ్చటగా అనిపించేవారు. ఎప్పుడూ వాళ్లు గొడవపడడం చూడలేదు. తిట్టుకోవడం, వాగ్వాదాలు జరిగిన ఘటనలు కూడా ఆ ఇంట్లో జరిగేవి కావు. ఫ్రెండ్స్, వీకెండ్ పార్టీలు లాంటివేమీ ఆ ఇంట్లో ఉండేవి కాదు. ఎప్పుడూ ఇల్లు ప్రశాంతంగా ఉండేది. వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్న విషయం నాకు ఆలస్యంగా తెలిసింది. మా ఇంట్లో పని చేసేవాళ్లు.. చైతూ, సామ్ విడిపోయారని, తమ సామానంతా తీసుకుని వెళ్లిపోయారని చెప్పారు. అది విని నేను షాకయ్యాను. ఒకవేళ ముందే తెలిసి ఉంటే వారితో మాట్లాడేవాడిని’’ అని మురళీ మోహన్ తెలిపారు.