7 సినిమాలొస్తున్నా సందడి ఏదీ

శుక్రవారం వస్తోందంటే చాలు ఏదో మొక్కుబడిగా థియేటర్లలో రిలీజైతే చాలనే సినిమాలు ఎక్కువవుతున్నాయి. స్టార్ హీరోలకే ఓపెనింగ్స్ అతి పెద్ద సవాల్ గా మారుతున్న పరిస్థితుల్లో అసలు ఎప్పుడు తీశారో తెలియనివి వాళ్ళ తో పోటీ పడేందుకు సిద్ధపడుతున్నాయి. ది వారియర్ నిరాశపరిచాక రాబోయే ఫ్రైడే మీద డిస్ట్రిబ్యూటర్లు చాలా ఆశలు పెట్టుకున్నారు. నాగ చైతన్య థాంక్ యు మళ్ళీ థియేటర్లకు ఊపు తెస్తుందనే నమ్మకంతో ఉన్నారు. హైప్ గొప్పగా చెప్పుకునే రేంజ్ లో లేకపోయినా టాక్ వస్తే చాలు చైతు నిలబెట్టేస్తాడు.

అలా అని ఇదొక్కటే సోలోగా రావడం లేదు. రన్బీర్ కపూర్ శంషేరా తెలుగు వెర్షన్ ని డబ్బింగ్ రూపంలో రిలీజ్ చేయబోతున్నారు. యాంకర్ అనసూయ ప్రధాన పాత్రలో రూపొందిన దర్జాని 22కే ఫిక్స్ చేశారు. ఆమె తప్ప ఇందులో ప్రత్యేకంగా చెప్పుకునే సెల్లింగ్ ఫ్యాక్టర్ ఏమీ లేదు. ప్రోమోలు గట్రా మాస్ ని టార్గెట్ చేస్తున్నాయి. అమ్మ రాజశేఖర్ హైఫైవ్, జగన్నాటకం, మీలో ఒకడులతో పాటు ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వచ్చిన హన్సిక మహా సైతం అదే డేట్ కి రంగంలోకి దిగుతోంది. ఇందులో శింబు స్పెషల్ క్యామియో చేశాడు.

మొత్తం ఏడు సినిమాలు వస్తున్నా దాని తాలూకు హడావిడి పెద్దగా కనిపించడం లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరుగుతున్నాయి కానీ ప్రేక్షకుల్లో దేని పట్లా చెప్పుకోదగ్గ ఆసక్తి రావడం లేదు. ఒక్క థాంక్ యు మాత్రమే జనాన్ని రప్పించేలా ఉంది కానీ మిగిలినవన్నీ ఆహా ఓహో అనే స్థాయిలో టాకులు రివ్యూలు వస్తే తప్ప కనీస స్థాయిలో ఆడటం కష్టం. మరోపక్క ఓటిటిలు కూడా థియేట్రికల్ రిలీజ్ జరుపుకున్న మీడియం రేంజ్ సినిమాలనే పరిశీలనలోకి తీసుకుంటున్నాయి. అందుకే ప్రతివారం ఈ జాతర తప్పేలా లేదు.