కొత్త సినిమాల కష్టాలు

జులై నెలలో తెలుగు సినిమాకు మరో వీకెండ్ నిరాశనే మిగిల్చేలా కనిపిస్తోంది. ఈ వారం రిలీజైన రెండు ఆసక్తికర చిత్రాల పరిస్థితి ఏమంత ఆశాజనకంగా కనిపించడం లేదు. వీటికి వచ్చిన టాక్ భిన్నంగా ఉన్నప్పటికీ.. బాక్సాఫీస్ దగ్గర పరిస్థితి మాత్రం ఒకేలా కనిపిస్తోంది. ముందుగా రామ్ సినిమా ‘ది వారియర్’ విషయానికి వస్తే.. ఈ చిత్రంపై ప్రేక్షకాసక్తి బాగానే ఉంది. ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్‌బస్టర్, రెడ్ లాంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత రామ్ చేసిన సినిమా కావడం.. తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వం వహించడంతో ‘ది వారియర్’ మీద మంచి అంచనాలే ఏర్పడ్డాయి. దీని ట్రైలర్ కూడా మాస్‌ను ఆకర్షించేలా రూపొందింది.

వర్షాల వల్ల అడ్వాన్స్ బుకింగ్స్ సరిగా జరగలేదు కానీ.. తొలి రోజు అంచనాలకు మించే థియేటర్లలో ఆక్యుపెన్సీ కనిపించింది. థియేటర్లు జనాలతో కళకళలాడాయి. కానీ ఈ ఉత్సాహాన్ని సినిమా నేరుగార్చేసింది. ‘ది వారియర్’లో పెద్దగా కంటెంట్ లేకపోవడంతో రివ్యూలు, మౌత్ టాక్ నెగెటివ్‌గా వచ్చాయి.

‘ది వారియర్’ సినిమా చూద్దామన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఉన్నప్పటికీ.. టాక్ అనుకూలంగా లేకపోవడం మైనస్ అయి ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర తడబడుతోంది. ఈ వీకెండ్లో వచ్చిన మరో సినిమా ‘గార్గి’ పరిస్థితి దీనికి భిన్నం. సాయిపల్లవి ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి మంచి టాక్ వస్తోంది. రివ్యూలు బాగున్నాయి. మౌత్ టాక్ కూడా బాగుంది. కానీ జనాలు ఇంత సీరియస్ మూవీని చూసే మూడ్‌లో ఇప్పుడు లేరు. వాళ్లు యాక్షన్, ఎంటర్టైన్మెంట్‌కే పెద్ద పీట వేస్తున్నారు. ‘గార్గి’ సినిమాకు ముందు నుంచి బజ్ అంతంతమాత్రంగానే ఉంది. తొలి రోజే థియేటర్లు వెలవెలబోయాయి.

సాయిపల్లవి మీద అభిమానం ఉన్నప్పటికీ.. ఆమెను వరుసగా సీరియస్, ప్యానిక్ క్యారెక్టర్లలో చూడడం వారికి నచ్చడం లేదు. ‘విరాటపర్వం’ విషయంలోనూ ఈ రకమైన అసంతృప్తి కనిపించింది. ఆ వెంటనే ‘గార్గి’ లాంటి మరో సీరియస్ మూవీ చేయడంతో సాయిపల్లవి అభిమానులు కూడా అంతగా ఈ సినిమా పట్ల ఆసక్తి కనబరచడం లేదు. అందుకే టాక్ బాగున్నా థియేటర్లలో ఆక్యుపెన్సీ తక్కువగా ఉంది. వసూళ్లు అంతంతమాత్రంగా ఉన్నాయి. ఇక రామ్ గోపాల్ వర్మ సినిమా ‘అమ్మాయి’, ప్రభుదేవా ‘మై డియర్ భూతం’ చిత్రాలను ప్రేక్షకులు అసలే పట్టించుకుంటున్నట్లుగా లేదు.