24 సీక్వెల్‌పై విక్రమ్ కుమార్ హింట్

బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో పెద్ద హిట్టవ్వలేదు కానీ.. హీరో సూర్య కెరీర్లో, అలాగే దర్శకుడు విక్రమ్ ఫిల్మోగ్రఫీలో అత్యున్నత స్థాయిలో ఉండే చిత్రాల్లో ‘24’ ఒకటి. ఇండియాలో వచ్చిన బెస్ట్ సైన్స్ ఫిక్షన్ చిత్రాల్లో దీన్ని ఒకటిగా చెప్పొచ్చు. వినూత్న కథాంశంతో ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు విక్రమ్. ఇందులో హీరో, విలన్ పాత్రల్లో సూర్య నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా ఆత్రేయగా ప్రతినాయకుడి పాత్రలో అతను అదరగొట్టేశాడనే చెప్పాలి. విలన్ పాత్రల్లో దానికి కల్ట్ స్టేటస్ ఇచ్చేయొచ్చు.

‘24’ సినిమా రిలీజ్ టైంలో దీని సీక్వెల్ గురించి చర్చ జరిగింది కానీ.. ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో మళ్లీ ఆ చర్చ లేకపోయింది. ఐతే విక్రమ్ కుమార్ మైండ్‌లో మాత్రం ‘24’ సీక్వెల్ ఆలోచన తిరుగుతూనే ఉన్నట్లుంది. తాజాగా తన కొత్త సినిమా ‘థ్యాంక్ యు’ ప్రమోషన్ల కోసమని మీడియాను కలిసిన విక్రమ్.. ‘24’ సీక్వెల్ ఊసు ఎత్తాడు.

ఆత్రేయ పాత్రకు సంబంధించి కథాంశాన్ని ఎక్స్‌టెండ్ చేస్తూ ‘24’ సినిమాకు సీక్వెల్ తీయొచ్చనే ఆలోచన తనకు ఉందని.. కానీ దాని మీద చాలా వర్క్ చేయాల్సి ఉందని విక్రమ్ చెప్పాడు. అన్నీ కుదిరితే భవిష్యత్తులో సూర్యతోనే ఈ సినిమా తీస్తానని చెప్పాడు. ఇక తన కొత్త ప్రాజెక్టుల గురించి చెబుతూ.. అమేజాన్ ప్రైమ్ కోసం నాగచైతన్యతోనే చేస్తున్న ‘దూత’ వెబ్ సిరీస్ పూర్తి కావస్తోందని.. దీని తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ సినిమా చేస్తానని చెప్పాడు.

మైత్రీ సంస్థలో విక్రమ్ ఇంతకుముందు నాని హీరోగా తీసిన ‘గ్యాంగ్ లీడర్’ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. అయినా ఆ సంస్థలో విక్రమ్ మరో సినిమా చేయబోతుండడం విశేషమే. ఐతే ఈ సినిమాకు హీరో ఎవరన్నది ఇంకా ఖరారవ్వలేదట. ఇక తాను బాలీవుడ్లో ఒక స్టార్ హీరోతో యాక్షన్ మూవీ చేసే అవకాశాలున్నాయని, దానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని విక్రమ్ వెల్లడించాడు. నాగచైతన్య హీరోగా దిల్ రాజు ప్రొడక్షన్లో తెరకెక్కిన ‘థ్యాంక్ యు’ వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.