వారియర్ ముందు కొత్త సవాళ్లు

ఇంకో ఏడు రోజుల్లో ది వారియర్ విడుదల కానుంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా మీద క్రేజీ బిజినెస్ జరిగింది. బాక్సాఫీస్ వద్ద ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోదగ్గ మూవీ ఏదీ లేకపోవడంతో రామ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ రిలీజ్ దక్కబోతోంది. అటు తమిళంలో భారీ ఎత్తున ప్రమోషన్ చేస్తున్నారు. దర్శకుడు లింగుస్వామి అంతా తానై కోలీవుడ్ ఇండస్ట్రీ దిగ్గజాలందరినీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తీసుకొచ్చి మీడియాకు షాక్ ఇచ్చాడు. ఇంతటి అరుదైన కలయిక ఎప్పుడూ చూడలేదన్న రామ్ మాటల్లో నిజముంది.

అంతా బాగానే ఉంది కానీ వారియర్ కు ఉండాల్సిన రేంజ్ లో తెలుగునాట అంత హైప్ కనిపించడం లేదన్నది ట్రేడ్ టాక్. రిలీజ్ రోజు ఎలాగూ హడావిడి ఉంటుంది కానీ ప్రస్తుతం పరిశ్రమలో నెలకొన్న ఒక రకమైన శూన్యతను బద్దలు కొట్టాలంటే ఇలాంటి మాస్ ఎంటర్ టైనర్ వల్లే అవుతుందని వాళ్ళ నమ్మకం. ఆర్ఆర్ఆర్ ని మినహాయిస్తే ఈ ఏడాదిలో భారీ వసూళ్లు నమోదు చేసుకున్న వాటిలో కెజిఎఫ్ 2, విక్రమ్ రెండూ డబ్బింగ్ సినిమాలే కావడం మర్చిపోకూడదు. డీజే టిల్లు లాంటివి హిట్టయ్యాయి కానీ వాటి రేంజ్ పదిహేను కోట్లలోపే.

సో వారియర్ ఇప్పుడీ అవకాశాన్ని పూర్తిగా వాడుకోవాలి. సాధారణ ప్రేక్షకులు మొదటి వారమే చూసేద్దామన్నంత టాక్ వచ్చేలా చూసుకోవాలి. ట్రైలర్ బాగానే అనిపించింది కానీ హీరో విలన్ క్లాష్, కొండారెడ్డి బురుజు సెటప్ ఇదంతా గతంలో చూసిన వ్యవహారమే అనే ఫీలింగ్ ఇచ్చింది. దానికి తోడు లింగుస్వామి పెద్ద హిట్టు కొట్టి ఏళ్ళు గడిచింది. ఏదో ఆషామాషీ కంటెంట్ తో సక్సెస్ వచ్చే ట్రెండ్ కాదిది. ఇందులో చాలా స్పెషల్ ఉందనే ఫీలింగ్ తీసుకురాగలగాలి. రామ్ ఎనర్జీ, కృతి శెట్టి గ్లామర్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, ఆది పినిశెట్టి విలనీ ఇవన్నీ వినగానే టికెట్లు బుక్ చేసుకునే కాంబో. కానీ ఆ కిక్ అడ్వాన్స్ బుకింగ్స్ లో కనిపించేలా పబ్లిసిటీ వేగం పెంచాలి.