మహేష్ స్లో అండ్ స్టడీ సూత్రం

వసూళ్ల సంగతి ఎలా ఉన్నా సర్కారు వారి పాట ఫలితం ఇటు నిర్మాతలకు అటు అభిమానులకు పూర్తి సంతృప్తినివ్వలేదన్నది వాస్తవం. సరిలేరు నీకెవ్వరు తర్వాత రెండేళ్ల నిరీక్షణకు ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టే బ్లాక్ బస్టర్ ఆశిస్తే దర్శకుడు పరశురామ్ జస్ట్ సూపర్ హిట్ తో సరిపుచ్చాడు. అందుకే ఇప్పుడు ప్రిన్స్ ఫ్యాన్స్ ఆశలన్నీ తన 28వ సినిమా మీద ఉన్నాయి. ఇప్పటిదాకా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాకపోవడం మీద పలు ప్రచారాలు జరగడంతో టీమ్ అఫీషియల్ అప్డేట్ ఇచ్చింది. ఆగస్ట్ నుంచి చిత్రీకరణ షురూ అట.

విడుదల 2023 సమ్మర్ అని చెప్పేశారు. అంటే ఎంతలేదన్నా ఇంకో పది నెలలు పైగానే పడుతుందన్న మాట. అంత టైం ఎందుకనే కామెంట్స్ లేకపోలేదు. సాధారణంగా త్రివిక్రమ్ హడావిడిగా సినిమాలు తీయడు. అనుకుంటే మాత్రం వేగంగానే పూర్తి చేయగలడు. అరవింద సమేత వీర రాఘవ దానికి మంచి ఉదాహరణ. అల వైకుంఠపురములో తర్వాత మాటల మాంత్రికుడు చాలా గ్యాప్ తీసుకుని ఈ స్క్రిప్ట్ ని రెడీ చేశారు. మధ్యలో భీమ్లా నాయక్ కోసం కొన్ని నెలలు కేటాయించి అటెళ్ళారు కానీ లేకపోతే ఇంకా వేగంగా అయ్యేది.

ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ సినిమా తర్వాత మహేష్ ఎవరికీ కమిట్ మెంట్ ఇవ్వలేదు. అంటే రాజమౌళితోనే నెక్స్ట్ ప్రాజెక్ట్ అనే క్లారిటీ ఉన్నట్టే. అదే నిజమైతే జక్కన్న చేతిలో పడ్డాక కనీసం రెండేళ్లు సూపర్ స్టార్ దర్శనం తెరమీద ఉండదు. అలాంటప్పుడు ఈ త్రివిక్రమ్ మూవీని త్వరగా పూర్తి చేసి ఇంకో డైరెక్టర్ తో వేరే సినిమా చేస్తే తమకు ఎక్కువ గ్యాప్ ఉండదనేది ఫ్యాన్స్ వెర్షన్. బాహుబలి కోసం ప్రభాస్, ఆర్ఆర్ఆర్ కోసం తారక్ చరణ్ లు ఖర్చుపెట్టిన సమయం చూస్తే వాళ్ళు అడిగింది సముచితమే.