లావణ్య త్రిపాఠి మాస్ పంచ్


సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేసినా వివాదంగా మార్చేవాళ్లు, కౌంటర్లు వేసే వాళ్లు రెడీగా ఉంటారు. ఇలా కూడా ఆలోచిస్తారా అనిపించేలా కామెంట్లు పెడుతుంటారు. టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠికి కూడా తాజాగా ఇలాంటి అనుభవమే ఎదురైంది. తాజాగా ఆమె మహేంద్రసింగ్ ధోనికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పింది. ఈ రోజు ధోని బర్త్ డేని అభిమానులు ట్విట్టర్లో మామూలుగా సెలబ్రేట్ చేయట్లేదు. ధోని గొప్పదనాన్ని చాటే ఫొటోలు, వీడియాలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

ఈ క్రమంలో లావణ్య కూడా ‘హ్యాపీ బర్త్ డే ఫేవరెట్’ అంటూ ఒక పోస్ట్ పెట్టింది. దీనికి ఒక నెటిజన్ తీవ్రంగా స్పందించాడు. విదేశాల్లో ఇలా సెలబ్రెటీలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే సంప్రదాయం ఉండదని.. జనాలు తమ పని తాము చేసుకుంటుంటారని.. ఇలాంటి పనికి మాలిన పనుల కోసం టైం వేస్ట్ చేయరు అనే విధంగా అతను పోస్ట్ పెట్టాడు. ఐతే లావణ్య ఆలస్యం చేయకుండా అతడికి దిమ్మదిరిగే పంచ్ ఇచ్చింది.

‘‘వాళ్లకు అమాయకులను కాల్చి పడేయడానికి మాత్రమే సమయం ఉంటుందేమో. అది చాలా బాధాకరం’’ అని రిప్లై ఇచ్చింది లావణ్య. అమెరికా లాంటి దేశాల్లో అకారణంగా అమాయకులను కాల్చి చంపేస్తున్న ఘటనలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. స్కూళ్లలోకి దూరి చిన్న పిల్లల్ని చంపేయడం.. రోడ్డు మీద కనిపించ వాళ్లనల్లా షూట్ చేయడం లాంటి ఉదంతాలు తరచుగా జరుగుతున్నాయి. మోడర్న్ సొసైటీగా చెప్పుకునే చోట్ల ఇలాంటి దారుణాలు చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ సొసైటీని కొనియాడుతూ తనకు పంచ్ ఇవ్వాలని చూసిన నెటిజన్‌కు లావణ్య మాస్ రిప్లై ఇచ్చింది. దెబ్బకు ఆ వ్యక్తి కాసేపటికే ట్వీట్ డెలీట్ చేసి వెళ్లిపోయాడు.

కాగా లావణ్య కొత్త చిత్రం ‘హ్యాపీ బర్త్ డే’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. లావణ్య గత చిత్రాలు ఆశించిన ఫలితాలనివ్వకపోవడంతో ఆమె కెరీర్ కొంచెం నెమ్మదించింది. ఇలాంటి టైంలో తను లీడ్ రోల్ చేసిన సినిమాపై ఆమె చాలా ఆశలే పెట్టుకుంది.