రామ్ కోసం ఇంత పెద్ద సెట‌ప్పా


టాలీవుడ్ హీరోలు ఒక్కొక్క‌రుగా త‌మ మార్కెట్‌ను ఇత‌ర రాష్ట్రాల‌కు విస్త‌రిస్తున్నారు. కొంద‌రు ప్లానింగ్‌తో తెలుగు రాష్ట్రాల అవ‌త‌ల‌ ఫాలోయింగ్ సంపాదిస్తుంటే.. కొంద‌రికి అనుకోకుండానే ఆద‌ర‌ణ ద‌క్కుతోంది. యువ క‌థానాయ‌కుడు రామ్.. ఇలాగే ఉత్త‌రాదిన ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. యూట్యూబ్‌లో రిలీజ‌య్యే అత‌డి డ‌బ్బింగ్ సినిమాల‌తో అత‌ను అక్క‌డ బాగా పాపుల‌ర్ అయ్యాడు. అత‌డి సినిమాల డ‌బ్బింగ్ హ‌క్కులు కోట్లు ప‌లుకుతున్నాయిప్పుడు. ద‌క్షిణాదిన మాత్రం రామ్ పాపులారిటీ తెలుగు రాష్ట్రాల‌కే ప‌రిమితం.

ఐతే ఇప్పుడు త‌మిళంలో అత‌ను మార్కెట్ సంపాదించే ప్ర‌య‌త్నంలో ప‌డ్డాడు. త‌న కొత్త చిత్రం ది వారియర్ తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఈ నెల 15నే ది వారియ‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని రూపొందించింది త‌మిళ ద‌ర్శ‌కుడే అయిన లింగుస్వామి కావ‌డం విశేషం.

లింగుస్వామికి త‌మిళంలో మంచి పేరుంది. కొన్ని భారీ హిట్లు ఆయ‌న ఖాతాలో ఉన్నాయి. ఈ చిత్రంలో ఆది విల‌న్‌గా న‌టించ‌డం కూడా త‌మిళ ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయ్యే విష‌య‌మే. ఇక రిలీజ్ ముంగిట సినిమాను త‌మిళంలో బాగా ప్ర‌మోట్ చేయ‌డం కోసం మాస్ట‌ర్ ప్లానే వేశాడు లింగుస్వామి. త‌న‌కున్న ప‌రిచ‌యాలు, ప‌లుకుబ‌డితో ప్రి రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేశాడు.

బుధ‌వారం చెన్నైలోని ఫేమ‌స్ స‌త్యం సినిమాస్‌లో జ‌రిగే ఈ ఈవెంట్‌కు దాదాపు 30 మంది కోలీవుడ్ ప్ర‌ముఖులు అతిథులుగా రాబోతుండడం విశేషం. వారిలో మ‌ణిర‌త్నం, భార‌తీరాజా, శంక‌ర్‌, ప్ర‌భు, గౌత‌మ్ మీన‌న్ లాంటి లెజెండ్స్‌తో పాటు లోకేష్ క‌న‌క‌రాజ్, వెట్రిమార‌న్, ఎస్.జె.సూర్య, మిత్ర‌న్, విజ‌య్ మిల్ట‌న్‌ లాంటి ప్రముఖ ద‌ర్శ‌కులు.. కార్తి, విశాల్, ఆర్య‌, విక్ర‌మ్ ప్ర‌భు లాంటి పేరున్న హీరోలు.. ఇలా ఈ జాబితాలో చాలా పెద్ద‌గానే ఉంది. బ‌హుశా కోలీవుడ్లో ఇంత‌మంది ప్ర‌ముఖులు ఒక సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో పాల్గొనడం ఇదే తొలిసారి కావ‌చ్చు. మొత్తానికి రామ్ కోలీవుడ్ ఎంట్రీకి ప్ర‌మోష‌న‌ల్ ప్లాన్ మామూలుగా లేదు.