దిల్ రాజు జాగ్రత్త పడుతున్నాడు

స్టార్ ప్రొడ్యూసర్ బ్రాండ్ తో కొనసాగుతున్న దిల్ రాజు భుజంపై ఇప్పుడు మరో భారం పడింది. బడా హీరోలకి భారీ హిట్టివ్వాలి, ప్రొడక్షన్ ని పాన్ ఇండియా రేంజ్ కి తీసుకెళ్ళాలి వాటితో పాటు తన ఫ్యామిలీ హీరో ఆశిష్ ని ఇండస్ట్రీలో నిలబెట్టాలి. తొలి ప్రయత్నంగా తీసిన ‘రౌడీ బాయ్స్’ తేడా కొట్టింది. అందుకే ఇప్పుడు ‘సెల్ఫిష్’ విషయంలో మరింత జాగ్రత్త పడుతున్నాడు. రెండో చిత్రంతో ప్రేక్షకులకు ఆశిష్ ని బాగా దగ్గర చేయాలని డిసైడ్ అయ్యాడు.

ఆశిష్ రెండో సినిమాను కొత్త దర్శకుడు కాశి చేతిలో పెట్టినప్పటికీ ప్రాజెక్ట్ అంతా తన హ్యాండోవర్ లోనే పెట్టుకున్నాడు రాజు. ‘రౌడీ బాయ్స్’ కి సంబంధించి ఆయన ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదు. తన కూతురు హన్సిత , అలాగే హర్షిత్ రెడ్డి చేతిలో ప్రాజెక్ట్ పెట్టేసి అప్పుడప్పుడు మాత్రమే లొకేషన్ కి వెళ్ళాడు. యూత్ సినిమా కదా మన నెక్స్ట్ జెనరేషన్ చూసుకుంటారు అనుకున్న రాజు గారి నమ్మకం వొమ్ము అయింది. దీంతో ఇప్పుడు ‘సెల్ఫిష్’ సినిమాకు సంబంధించి దిల్ రాజే అన్నీ డిసైడ్ చేస్తున్నాడట. ఆశిష్ సరసన శ్రీ లీల ని హీరోయిన్ లాక్ చేశారు. తన సంస్థలో ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన మిక్కీ జే మేయర్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నాడు.

పైగా ఇందులో సుకుమార్ ని భాగస్వామి చేశాడు. ఈ సినిమాకి సుక్కు మీద కూడా తన శిష్యుడి మొదటి సినిమా భారం పడింది. ఈ సినిమాతో ఇద్దరినీ నిలబెట్టి ఇండస్ట్రీలో బిజీ చేయాలని చూస్తున్నారు రాజు -సుక్కు. తెలంగాణా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ తో ఆశిష్ హిట్టు కొడతాడా ? దిల్ రాజు నమ్మకాన్ని సుకుమార్ శిష్యుడు నిలబెట్టుకుంటాడా చూడాలి.