ప్రభాస్ అభిమానుల్లో టెన్షన్

ఒక పెద్ద హీరోతో ఒక దర్శకుడు జట్టు కట్టబోతున్నట్లు వార్త బయటికి రాగానే.. ఆ దర్శకుడి చివరి సినిమా మీద దృష్టిసారిస్తారు ఆ హీరో అభిమానులు. ప్రభాస్ అభిమానుల దృష్టి ఇప్పుడు అలాగే మారుతి మీద పడింది. ప్రభాస్ కొత్త సినిమాకు అతను దర్శకత్వం వహిస్తున్నట్లు కొన్ని నెలల కిందటే వార్త బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. మారుతి సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఇక ఆ సినిమాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సినిమా పట్టాలెక్కాల్సి ఉంది.

ఈ లోపు మారుతి లేటెస్ట్ మూవీ ‘పక్కా కమర్షియల్’ థియేటర్లలోకి దిగింది. చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్ ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం థియేటర్లకు వెళ్లిపోయారు. ఐతే వారి అంచనాలను మారుతి అందుకోలేకపోయాడు. మారుతి కెరీర్లోనే వీకెస్ట్ వర్క్స్‌లో ఒకటిగా ‘పక్కా కమర్షియల్’ టాక్ తెచ్చుకుంది. కామెడీ కొంత మేర వర్కవుట్ అయినప్పటికీ.. బలమైన కథాకథనాలు లేకపోవడం సినిమాకు మైనస్‌గా నిలిచింది.

అసలే ప్రభాస్ ‘బాహుబలి’ తర్వాత వరుసగా రెండు పెద్ద డిజాస్టర్లు ఎదుర్కొన్నాడు. అతడి తర్వాతి రిలీజ్ ‘ఆదిపురుష్’ మీద రకరకాల సందేహాలు నెలకొన్నాయి అభిమానుల్లో. అందరికీ తెలిసిన రామాయణం కథతో తెరకెక్కిన ఈ చిత్రం ఈ తరం ప్రేక్షకులను ఏమేర మెప్పిస్తుందో, ఏం కొత్తదనం పంచుతుందో అన్న డౌట్లున్నాయి. మారుతి సినిమాను చాలా వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది ఫస్టాఫ్‌లోనే రిలీజ్ చేయాలనే ఆలోచనతో ప్రభాస్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. అలాంటపుడు ప్రభాస్ స్థాయికి తగ్గ సినిమాను మారుతి డెలివర్ చేయగలడో లేదో అన్న సందేహాలు ‘పక్కా కమర్షియల్’ చూశాక కలుగుతున్నాయి అభిమానుల్లో.

మారుతి దీని కంటే ముందు తీసిన ‘మంచి రోజులు వచ్చాయి’ కూడా ఫ్లాప్ అయింది. దానికి ముందు వచ్చిన ‘ప్రతి రోజు పండగే’ చిత్రం డివైడ్ టాక్‌ను తట్టుకుని బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ సినిమాగా నిలబడింది. మరి ఇప్పుడున్న ఫాంలో మారుతి.. ప్రభాస్ లాంటి బిగ్ స్టార్‌తో ఎలాంటి సినిమా తీసి, ఏమేర మెప్పిస్తాడో చూడాలి.