చిరును ఇంప్రెస్ చేసిన ఫ్యాన్ స్పీచ్‌

ఎస్కేఎన్.. సామాన్య ప్రేక్ష‌కుల‌కు ఈ పేరు పెద్ద‌గా తెలియ‌క పోవ‌చ్చు కానీ.. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో బాగానే పాపుల‌ర్. ఒక సాధార‌ణ చిరంజీవి అభిమానిగా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి.. ఆ త‌ర్వాత పీఆర్వోగా మారి.. ఇప్పుడు నిర్మాత‌గా కూడా మారి త‌న‌కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడ‌త‌ను. మెగా ఫ్యామిలీలో అంద‌రు హీరోల సినిమాల‌కూ అత‌ను పీఆర్వోగా ప‌ని చేశాడు. అందులోనూ అల్లు అర్జున్‌కు అత‌ను అత్యంత స‌న్నిహితుడు.

గీతా ఆర్ట్స్ సినిమాల‌కు పీఆర్వోగా ప‌ని చేయ‌డమే కాక‌.. నిర్మాణ వ్య‌వ‌హారాల్లోనూ భాగ‌స్వామిగా ఉంటూ అల్లు అర‌వింద్‌ను సైతం ఇంప్రెస్ చేశాడు. ఆ ఫ్యామిలీ స‌పోర్ట్‌తో ట్యాక్సీవాలా మూవీతో నిర్మాత‌గా మారాడు. అంత‌కంటే ముందు నుంచి తన మిత్రుడైన‌ మారుతి సినిమాల్లోనూ నిర్మాణ భాగ‌స్వామిగా ఉంటున్నాడు. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీలోనూ ఎస్కేఎన్ భాగ‌స్వామ్య‌ముంది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో చిరంజీవిని చూసి ఎగ్జైట్ అవుతూ అత‌ను ఇచ్చిన ఎమోష‌న‌ల్ స్పీచ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

భార‌త దేశానికి తూర్పున హిమాల‌యాలు, ప‌శ్చిమాన బంగాళాఖాతం అంటూ స్పీచ్ త‌ప్పుగానే మొద‌లుపెట్టిన‌ప్ప‌టికీ.. ఆ త‌ర్వాత చిరుకు ఎలివేషన్ ఇవ్వ‌డంలో మాత్రం ఎస్కేన్ విజ‌య‌వంతం అయ్యాడు. తెలుగు ప‌రిశ్ర‌మ‌కు సంబంధించి అన్ని దిక్కులూ చిరునే అని.. ఇండ‌స్ట్రీకి ఏ అవ‌స‌రం వ‌చ్చినా ఆయ‌న ముందుంటార‌ని.. ఈ విష‌యంలో ఎవ‌రైనా ఆయ‌న త‌ర్వాతే అని ఎస్కేఎన్ అన్నాడు. ఇండ‌స్ట్రీలో చిరు ఎవ‌రెస్ట్ లాంటి వాడ‌ని పేర్కొన్నాడు.

ఏలూరులోని ఒక థియేట‌ర్లో చిరు సినిమాకు బ్యాన‌ర్ క‌ట్టిన తాను.. ఈ రోజు గీతా ఆర్ట్స్ సినిమాల్లో నిర్మాణ భాగ‌స్వామి అయ్యేలా ఎదిగానంటే అది చిరు ఇచ్చిన స్ఫూర్తే అని ఎస్కేఎన్ అన్నాడు. ఇంకా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ టీంలో అంద‌రి గురించి ఎస్కేఎన్ త‌న‌దైన శైలిలో పంచుల‌తో కూడిన ఎలివేష‌న్లు ఇచ్చాడు. చివ‌ర్లో చిరంజీవి మాట్లాడుతున్న‌పుడు.. ప్ర‌త్యేకంగా ఎస్కేఎన్ గురించి ప్ర‌స్తావించ‌డం విశేషం. ఎస్కేఎన్ త‌మ మ‌నిషి అని, అత‌డిలో ఇంత ఎమోష‌న్ ఉంద‌ని త‌న‌కు తెలియ‌ద‌ని.. త‌న స్పీచ్ ఇంప్రెస్ చేసింద‌ని చిరు చెప్పాడు. దీంతో ఎస్కేఎన్ ఆయ‌న కాళ్ల మీద ప‌డి ఆశీర్వాదం తీసుకున్నాడు.