మంచి సినిమా.. అమ్మ బాబోయ్

మంచి సినిమా.. ఈ మాట అంటే టాలీవుడ్ నిర్మాతలు భయపడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఆ ట్యాగ్ వేయించుకున్న సినిమాలు వరుసగా బోల్తా కొడుతుండమే అందుక్కారణం. ఈ రోజుల్లో భారీతనం, విజువల్ ఎఫెక్ట్స్, ఫుల్ లెంగ్త్ యాక్షన్, క్రేజీ కామెడీ ఉన్న సినిమాలే ఆడుతున్నాయి తప్ప సున్నితమైన కథలతో సినిమాలు చేస్తే జనాలకు రుచించట్లేదు.

ముఖ్యంగా ‘మంచి సినిమా’ అనిపించుకుంటే బాక్సాఫీస్ దగ్గర కష్దాలు తప్పట్లేదు. ఇందుకు తాజా ఉదాహరణ.. విరాటపర్వం. రానా దగ్గుబాటి, సాయిపల్లవి లాంటి ఆకర్షణీయ జంట.. ‘నీదీ నాదీ ఒకే కథ’తో అరంగేట్రంలోనే సత్తా చాటిన వేణు ఉడుగుల లాంటి దర్శకుడు.. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ.. అభిరుచి ఉన్న టెక్నీషియన్లు.. ఇంతమంది కలిసి చేసిన ఈ సినిమాకు ఉన్నంతలో మంచి టాకే వచ్చింది. కానీ కలెక్షన్లు చూస్తే తుస్సుమనిపించాయి. రూ.12 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ చిత్రానికి ఫుల్ రన్లో రూ.3 కోట్ల షేర్ కూడా రాని పరిస్థితి.

‘విరాటపర్వం’ చూసిన వాళ్లందరూ దీన్ని ‘మంచి’ సినిమాగానే పేర్కొన్నారు. ఇలాంటి ప్రయత్నాలు అరుదుగా జరుగుతాయని, తప్పక చూడాల్సిన సినిమా అని అన్నారు. కానీ జనాలు ఈ సినిమాను తిరస్కరించారు. ఈ సినిమాకు వచ్చిన ఫలితం చూస్తే.. ఇలాంటి ప్రయత్నాలు చేయాలంటే భయపడే పరిస్థితి తలెత్తుతోంది.

‘విరాటపర్వం’ కంటే వారం ముందు వచ్చిన నాని సినిమా ‘అంటే సుందరానికీ’ది కూడా ఇలాంటి పరిస్థితి. ఈ సినిమా ప్రోమోలన్నీ కూడా ఆకర్షణీయంగా కనిపించాయి. రిలీజ్ తర్వాత డీసెంట్ టాక్ కూడా వచ్చింది. ఫస్టాఫ్ కొంచెం ల్యాగ్ అన్నది తప్పితే పెద్దగా కంప్లైంట్లేమీ లేవు. ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన మంచి సినిమాల్లో ఒకటిగా దీని గురించి అందరూ మాట్లాడుకున్నారు. కానీ ఈ సినిమాకు వసూళ్లు ఆశించిన స్థాయిలో రాలేదు. ఒక్క యుఎస్ ఆడియన్స్ మాత్రమే ఈ చిత్రాన్ని బాగా ఆదరించారు. ఇక్కడ మిలియన్ డాలర్లు రాబట్టిన ‘అంటే సుందరానికీ’ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నామమాత్రపు వసూళ్లతో సరిపెట్టుకుంది.

‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ అనే చిన్న సినిమా కూడా దాదాపు ఈ కోవకే చెందుతుంది. అందరూ మంచి సినిమాగా దీన్ని మెచ్చుకున్నారు. కానీ ఆ టాక్ వసూళ్ల రూపంలో ప్రతిఫలించలేదు. ఓ మోస్తరు ఓపెనింగ్స్‌తో సరిపెట్టుకున్న ఈ చిత్రం వీకెండ్ తర్వాత పెద్దగా ప్రభావం చూపించలేదు. తర్వాత ఓటీటీలో రిలీజ్ చేస్తే జనం తెగ చూస్తున్నారు. సినిమాను ఇంకా కొనియాడుతన్నారు. థియేటర్లలో ఇంత మంచి సినిమా ఎందుకు సరిగా ఆడలేదని ఆశ్చర్యపోతున్నారు.

గత ఏడాది వచ్చిన సత్యదేవ్-నిత్యా మీనన్‌ల ‘స్కైలాబ్’, అవసరాల శ్రీనివాస్ సినిమా ‘నూటొక్క జిల్లాల అందగాడు’.. ఈ మధ్యే రిలీజైన సుమ చిత్రం ‘జయమ్మ పంచాయితీ’ల పరిస్థితి కూడా అంతే. వీటికి మంచి సినిమాలుగా పేరొచ్చింది. ఈ మూడు చిత్రాలు చిత్రాలు ఓటీటీలో వచ్చాక ప్రశంసలు అందుకున్నాయి. గత ఏడాదే రిలీజైన శర్వానంద్ సినిమా ‘శ్రీకారం’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ ‘మంచి సినిమా’ ట్యాగే ఈ చిత్రాన్ని కూడా దెబ్బ తీసిందని చెప్పాలి.

నాగశౌర్య సినిమా ‘వరుడు కావలెను’ కూడా ఓటీటీలో ప్రశంసలందుకుని, థియేటర్లలో ఎందుకు ఆడలేదనే సందేహాలు రేకెత్తించింది. అక్కినేని నాగార్జున సినిమా ‘వైల్డ్ డాగ్’ సైతం మంచి రేటింగ్స్, ప్రశంసలు తెచ్చుకుని థియేటర్లలో పెద్దగా ఆడకుండానే వెళ్లిపోయింది. తర్వాత ఓటీటీలో మంచి స్పందన తెచ్చుకుంది. సాయిధరమ్ తేజ్ సినిమా ‘రిపబ్లిక్’ను ఓటీటీలో వచ్చాక కల్ట్ మూవీగా పేర్కొన్నారు కానీ.. థియేటర్లలో ఉండగా ఎవరూ చూడలేదు.