శ్రీదేవి కూతురి బ్యాడ్ ప్లానింగ్

ఒకప్పుడు తెలుగులోనే కాదు ఇండియా వైడ్ పాపులారిటీలో శ్రీదేవిని మించినవారు లేరు. ఏఎన్ఆర్ తో స్టెప్పులు వేయాలన్నా వాళ్ళబ్బాయి నాగార్జునతో ఆడిపాడాలన్నా ఆమెకే చెల్లింది. చిరంజీవి అంతటి మెగాస్టార్ కే అతిలోకసుందరి జోడిగా నటించడానికి పదేళ్లు పట్టింది. ఇక హిందీ గురించి చెప్పుకుంటూ పోతే పుస్తకమే అవుతుంది. కోట్లాది అభిమానులను సొంతం చేసుకుని వాళ్ళ గుండెల్లో చెరగని ముద్ర వేసిన శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ మీద మొదట్లో భారీ అంచనాలు ఉండేవి. ఫ్యాన్స్ జూనియర్ శ్రీదేవిగా పిలుచుకున్నారు.

కానీ తీరా ఆ అమ్మాయి కెరీర్ ప్లానింగ్ చూస్తుంటే స్క్రీన్ కంటే ఓటిటిలో ఎక్కువ కనిపించేలా ఉంది. 2108 ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఈ ఐదేళ్లలో చేసిన సినిమాలు చాలా తక్కువ. వాటిలో గుంజన్ సక్సేనా, ఘోస్ట్ స్టోరీస్ డైరెక్ట్ డిజిటల్ లో వచ్చేశాయి. నయనతార కోకో కోకిల రీమేక్ గుడ్ లక్ జెర్రీ కూడా థియేటర్లకు వెళ్లే సాహసం చేయలేకపోయింది. మరో మళయాలం మూవీ హెలెన్ ని జాన్వీ మిలిగా చేసింది. ఇది ఎందులో వస్తుందో ఇంకా తెలియదు. ఎప్పుడో నవంబర్ లో పూర్తి చేస్తే ఇప్పటిదాకా రిలీజ్ అప్డేట్ లేదు.

ఇవి కాకుండా చేతిలో ఉన్న రెండు సినిమాలు మిస్టర్ అండ్ మిసెస్ మహీ, బవాల్. అంతే. నిజానికి గతంలో తనకు టాలీవుడ్ నుంచి మంచి ఆఫర్స్ వెళ్లాయి. దిల్ రాజు, పూరి లాంటి వాళ్ళు అప్రోచ్ అయ్యారు. కానీ తండ్రి బోనీ కపూర్ ఏదేదో అంచనా వేసుకుని ఇక్కడ లాంచ్ చేయడం వాయిదా వేసుకుంటూ వచ్చారు. కట్ చేస్తే ఇప్పుడామె మీద మనోళ్లకు ఆసక్తి తగ్గిపోయింది. అక్కడ చూస్తేనేమో అధిక శాతం రీమేకులు, ఓటిటి రిలీజులతో ప్లానింగ్ ఎగుడుదిగుడుగా మారింది. చూస్తుంటే శ్రీదేవి వారసత్వం నిలబెట్టడం కష్టమే అనిపిస్తోంది