OTTల దోపిడీ వెనుక అసలు కథ

ఆ మధ్య కెజిఎఫ్ 2, నిన్న సర్కారు వారి పాట. 199 రూపాయల రెంటల్ పద్ధతిలో అమెజాన్ ప్రైమ్ తీసుకొచ్చిన ఎర్లీ ప్రీమియర్ విధానం మీద ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ సదరు సంస్థ మాత్రం దాన్ని కొనసాగించే ప్రణాళికతో ముందే సిద్ధమయిపోయింది. సోషల్ మీడియాలో దీని పట్ల వ్యతిరేకతను వాళ్ళు గుర్తించలేక కాదు. సగటు భారతీయ మనస్తత్వాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాకే దీనికి తెరతీశారని విశ్లేషకుల అంచనా.

ఇప్పుడైతే ఏంటిదని తిట్టుకుంటున్నాం కానీ భవిష్యత్తులో అలవాటుగా మార్చుకుంటామని వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఇప్పుడిది ఒకరికే పరిమితమనిపించినా తర్వాత అందరూ ఇదే దారిలో వెళ్లడంలో అనుమానం లేదు. పెట్రోల్, గ్యాస్, డీజిల్, నిత్యావసరాలు వీటి రేట్లు పెరిగినా తగ్గినా సామాన్యుడు మౌనంగా భరించడం తప్ప చేస్తున్నదేమి లేదు. సినిమా టికెట్లకు సైతం ప్రభుత్వాలు జిఓల పేరిట అనుమతులు ఇస్తున్నాయి కదాని నిర్మాతలు నాలుగు వందల దాకా పిండుతుంటే సహృదయంతో ఇచ్చేస్థున్నాం.

పెద్ద హీరో ఉంటే చాలు పెంపుకు వెళ్లిపోతున్న వైనాన్ని అంగీకరిస్తున్నాం. జనం థియేటర్లకు రావడం తగ్గినప్పటికీ ఓపెనింగ్స్ వస్తున్న తీరు ప్రొడ్యూసర్లకు ధైర్యాన్ని ఇస్తున్నాయి. అందుకే పైకి దుమ్మెత్తిపోసినా ప్రతి దోపిడీని అంగీకరిస్తున్న సగటు ఇండియన్ మెంటాలిటీ తీరుని బాగా స్టడీ చేశాకే ఇలాంటి పే పర్ వ్యూ మోడళ్ళు మెల్లగా మన మెదడులోకి ఎక్కిస్తున్నారు.

ఫలితంతో సంబంధం లేకుండా కేవలం మూడు వారాలకే కొత్త సినిమాలు ఓటిటిలో వస్తున్నప్పుడు థియేటర్ కు వెళ్లే టెంప్టేషన్ ని ఆ కొద్దిరోజులు కంట్రోల్ చేసుకుంటే చాలు ఇంటిల్లిపాది రెండువందలకే చూసేయొచ్చు కదానే మనస్తత్వం క్రమంగా పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. జియో సిమ్ములు మొదట్లో ఫ్రీగా ఇచ్చారు. పైసల్లేకుండా డేట్ అన్ లిమిటెడ్ అన్నారు. ఇప్పుడు నెలకు కనీసం మూడు వందలు వదిలించుకోవాల్సిన పరిస్థితి. ఈ ఓటిటిలు కూడా అంతే. బాగా అలవాటు చేశారు. ఇప్పుడు వదులుకోలేం. త్వరగా చూస్తున్నామనే ఫీలింగ్ ఆ రెండు వందలు ఖర్చు పెట్టేలా చేస్తుంది. ఇంకాస్త ఓపిక పడితే ఫ్రీ స్ట్రీమింగ్ ఆప్షన్ కూడా ఇస్తున్నారుగా.