మాస్ దర్శకుడికి నాగార్జున పిలుపు

ప్రస్తుతం ది ఘోస్ట్ షూటింగ్ లో ఉన్న అక్కినేని నాగార్జున తర్వాత ఎవరితో చేయబోతున్నారనే క్లారిటీ ఇంకా రాలేదు. ఖాళీ సమయాన్ని బిగ్ బాస్ షో కోసం వాడుకున్న అక్కినేని హీరో ప్రస్తుతం ఓ మాస్ దర్శకుడికి కథ వినేందుకు ఓకే చెప్పారట. సంపత్ నంది చెప్పిన ఒక లైన్ నచ్చడంతో దాని ఫుల్ వెర్షన్ చూశాక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారని ఫిలిం నగర్ టాక్.

బంగార్రాజు సక్సెస్ తర్వాత తనకు మాస్ లో ఇమేజ్ పూర్తిగా తగ్గలేదని గుర్తించిన నాగ్ దాన్ని మరింత బలోపేతం చేసే ప్లాన్లో ఇలా ఆలోచిస్తున్నారని తెలిసింది. సంపత్ నందికి ఎంత మాస్ పల్స్ మీద పట్టున్నా కూడా రచ్చ తర్వాత దాని స్థాయిలో పెద్ద హిట్టు కొట్టలేదు. బెంగాల్ టైగర్ యావరేజ్ గా నిలవగా గౌతమ్ నందా ఫ్లాప్ అయ్యింది. రెండూ భారీ బడ్జెట్ లతో రూపొందినవే.

సరే పోన్లేమ్మని గోపీచంద్ సీటిమార్ రూపంలో మరో అవకాశం ఇస్తే అదీ సోసో ఫలితాన్నే ఇచ్చింది. దీంతో రామ్ చరణ్ తో ప్లాన్ చేసుకున్న చోటా మేస్త్రీ పూర్తిగా పక్కకెళ్లిపోయిందని వినికిడి. ప్రస్తుతం సంపత్ కథలు అందించి నిర్మాణ భాగస్వామ్యం వహించిన బ్లాక్ రోజ్, ఓదెల రైల్వేస్టేషన్ నిర్మాణంలో ఉన్నాయి.

ఇక నాగార్జున విషయానికి వస్తే ఆఫీసర్, వైల్డ్ డాగ్, మన్మథుడు 2 లాంటి రాంగ్ సెలక్షన్ వల్ల అటు క్లాస్ ఇటు మాస్ ఇద్దరినీ మెప్పించలేక డిజాస్టర్స్ కొనితెచ్చుకున్నారు. సంక్రాంతి సీజన్ వల్ల బంగార్రాజు కాస్త బెటర్ గా ఆడింది కానీ పోటీ ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. ఒకప్పుడు అల్లరి అల్లుడు, వారసుడు. ఘరానా బుల్లోడు లాంటి కమర్షియల్ హిట్స్ పడాలంటే సంపత్ నంది లాంటి వాళ్ళైతేనే కరెక్టనేది కింగ్ అభిప్రాయం కావొచ్చు. మరి ప్రవీణ్ సత్తారు, కళ్యాణ్ కృష్ణలాగా ఇతనూ నాగ్ ను ఎలా ఒప్పించుకుంటాడో చూడాలి.