ప్రేక్షకుల పల్స్ తెలిసిపోయింది

కరోనా వచ్చి వెళ్లిపోయింది. ఓటిటి ఎన్నడూ లేనంత స్థాయిలో ఇళ్లలోకి చొచ్చుకుపోయింది. కొత్త రిలీజులను డైరెక్ట్ గా సోఫాలో కూర్చుని చూసేస్తున్నారు. ఇంతలా మార్పులు చోటు చేసుకున్న తరుణంలో థియేటర్ల మనుగడ ఎలా అనే ప్రశ్నకు సమాధానం ప్రేక్షకులు కలెక్షన్ల రూపంలో ఇస్తున్నారు. టికెట్ రేట్లు ఎక్కువా తక్కువా అనేది పక్కనపెడితే తమకు బిగ్ స్క్రీన్ మీద ఎలాంటి కంటెంట్ అయితే ఎంజాయ్ చేస్తామో అది నిజంగా ఇచ్చినప్పుడు ధర గురించి పెద్దగా పట్టించుకోమనే సందేశాన్ని ఇస్తూనే, ఏ మాత్రం యావరేజ్ ఉన్నా సరే దానికి కూడా అధిక డబ్బులు అడిగితే చెల్లించే ప్రసక్తే లేదనే హెచ్చరికలు కూడా చేస్తున్నారు. అదెలాగో చూద్దాం.

ఈ ఏడాది వచ్చిన వాటిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఆర్ఆర్ఆర్. కెజిఎఫ్2లు. విజువల్ గ్రాండియర్స్ గా వాటి మీదున్న హైప్ కి, దర్శకులు తీర్చిదిద్దిన తీరుకి, భారీ క్యాస్టింగ్ కి వందల కోట్ల రూపాయలు వసూళ్ల వర్షం గా కురిశాయి. వీటిని బ్యాలన్స్ చేస్తే చాలు నాలుగు వందలయినా సరే టికెట్ కొంటామని ఆడియన్స్ ఋజువు చేశారు. డీజే టిల్లు లో ఇవేవి లేకపోయినా న్యూ జనరేషన్ కామెడీని ఫ్రెష్ గా చూపించడంతో ఎప్పటి నుంచో బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న సిద్దు జొన్నలగడ్డని ఓవర్ నైట్ స్టార్ ని చేశారు. ఆచార్యకు అన్నీ ఉన్నా అసలైనవి నాసిరకంగా ఉండటంతో చిరు చరణ్ లకు ఊహించని పరాభవాన్ని రుచి చూపించారు.

ఇప్పుడు ఎఫ్3 హిట్టు కొట్టింది. కనివిని ఎరుగని హిలేరియస్ హాస్యం కాకపోయినా చూస్తున్న రెండున్నర గంటలు టైం పాస్ చేయించడంలో వెంకీ వరుణ్ అనిల్ రావిపూడిలతో పాటు క్యాస్టింగ్ మొత్తం సక్సెస్ కావడంతో మొదటి మూడు రోజులు హౌస్ ఫుల్ బోర్డులు కళకళలాడాయి. సర్కారు వారి పాటలో మ్యాటర్ మరీ బలంగా లేకపోవడం వల్లే మహేష్ స్థాయికి తగ్గ ఇండస్ట్రీ హిట్ అందలేదన్నది వాస్తవం. అశోకవనంలో అర్జున కళ్యాణం టాక్ బాగున్నప్పటికీ మరీ థియేటర్ మెటీరియల్ కాదని జనం ఫీలయ్యారు. సో కట్టిపడేసే కథాకథనాలు ఉన్న భారీతనం లేదా హాయినా నవ్వించే ఎంటర్ టైన్మెంట్. ఇదీ ఇప్పటి థియేటర్ ప్రేక్షకుల పల్స్