హైదరాబాద్‌లో రెండు కొత్త ఫిలిం సిటీలు

ప్రపంచంలో ఎన్నో ఫిలిం సిటీలు ఉన్నప్పటికీ.. అందులో రామోజీ ఫిలిం సిటీ చాలా ప్రత్యేకంగా. ఏకంగా 1600 ఎకరాల్లో విస్తరించిన ఆర్ఎఫ్‌సీ.. ప్రపంచంలోనే అతి పెద్ద ఫిలిం స్టూడియోగా గిన్నిస్ రికార్డు కూడా సాధించింది. ఇండియాలోని అన్ని భాషల చిత్రాలు, సీరియళ్లు, వెబ్ సిరీస్‌లు ఇక్కడ చిత్రీకరణ జరుపుకుంటూ ఉంటాయి. 

ముంబయి సహా పలు నగరాల్లో భారీ స్టూడియోలు ఉన్నాయి. హైదరాబాద్‌లో కూడా స్టూడియోలకు లెక్క లేదు. కానీ ఆర్ఎఫ్‌సీ అంత విశాలంగా, అన్ని సౌకర్యాలతో ఉన్న స్టూడియో మరొకటి ఉండదు. ఐతే ఇప్పుడు హైదరాబాద్‌లోనే ఇంకో రెండు పెద్ద ఫిలిం సిటీలు రాబోతుండడం విశేషం. వాటిని నిర్మించబోయేది బాలీవుడ్ సూపర్ స్టార్లు సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్ కావడం గమనార్హం. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోబోతోంది.

తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫ్యూచర్ సిటీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. అక్కడికి భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి.. హైదరాబాద్‌‌కు అనుబంధంగా ఒక కొత్త నగరాన్ని నిర్మించి తనదైన ముద్ర వేయాలని భావిస్తున్నారు రేవంత్. త్వరలో జరగబోతున్న గ్లోబల్ సమ్మిట్లో భాగంగా ఫ్యూచర్ సిటీలో భారీ పెట్టుబడులు పెట్టే దిశగా అనేక ఒప్పందాలు చేసుకోబోతున్నారు. 

ఇప్పటికే అక్కడ ఒక ఫిలిం సిటీ నిర్మించేందుకు సల్మాన్ ఖాన్‌కు ప్రభుత్వం భూమి కేటాయించింది. తాజాగా అజయ్ దేవగణ్ సైతం ఒక భారీ ఫిలిం సిటీ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతి పొందాడు. గ్లోబల్ సమ్మిట్లోనే ఈ ఒప్పందం పూర్తి కానుంది. మరోవైపు వంతారా పేరుతో అభయారణ్యాన్ని నిర్వహించేందుకు ముకేశ్ అంబానీ ముందుకొచ్చారు. ఆయనకు కొన్ని వందల ఎకరాలను అప్పగించబోతున్నారు. ఇంకా మరిన్ని భారీ ఒప్పందాలు గ్లోబల్ సమ్మిట్లో పూర్తి కాబోతున్నాయి.