మేజర్ ఇది మర్చిపోతే ఎలా?

వచ్చే శుక్రవారం విడుదల కాబోతున్న మేజర్ ప్రమోషన్లు ఊపుమీదున్నాయి. దేశవ్యాప్తంగా ప్లాన్ చేసిన ప్రీ రిలీజ్ ప్రీమియర్స్ నుంచి మంచి స్పందన దక్కుతోంది. అక్కడి ప్రేక్షకుల తాలూకు రెస్పాన్స్ ని వీడియోల రూపంలో అడవి శేష్ షేర్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ లో జూన్ 2వ తేదీ గురువారం రాత్రి స్పెషల్ షోలు వేయబోతున్నారు. ప్రసాద్ ఐమ్యాక్స్ రెండు స్క్రీన్లతో పాటు ఏఎంబి మాల్ లో ఒకటి కలిపి మొత్తం మూడు ఆటల టికెట్లు అమ్ముడుపోయాయి.

రేపో ఎల్లుండో మరిన్ని ప్రదర్శనలు జోడించబోతున్నారు. ఇక టికెట్ రేట్ల గురించి శేష్ తన ట్విట్టర్ లో ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ పాండమిక్ తర్వాత తక్కువ ధరలతో తమ సినిమాను ప్రేక్షకులకు అందించబోతున్నట్టు ట్వీట్ చేయడం చర్చకు దారి తీసింది. ఎందుకంటే పోస్టర్ లో ఈ రేట్లతో వస్తున్న మూవీ తమదేనని అందులో పేర్కొన్నాడు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఎంతెంతకు ఇస్తున్నారో స్పష్టంగా పేర్కొన్నాడు.

అయితే ఇక్కడే మేజర్ మిస్ అయిన లాజిక్ ఒకటుంది. మూడు నెలల క్రితమే భీమ్లా నాయక్ లాంటి సినిమాలు ఏపి సింగల్ స్క్రీన్లలో 100 రూపాయలకు ప్రదర్శించారు. కొత్త జివో వచ్చే వరకు ప్రతి సినిమాకు ఇలాగే జరిగింది. రాధే శ్యామ్ ముందు వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. కానీ మేజర్ కి ఇప్పుడు చెబుతున్న రేట్ 147 రూపాయలు. అలాంటప్పుడు దేంతో పోల్చుకున్నా మాదే అతి తక్కువ ధర అని చెప్పడం కరెక్ట్ కాదు.

ఆ ట్వీట్ కింద అభిమానులు అప్పటి బుకింగ్స్ తాలూకు స్క్రీన్ షాట్లను షేర్ చేసుకుని మరీ మీరు రాంగ్ బ్రో అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే శేష్ కు గతంలో జరిగిన పరిణామాల మీద అంతగా అవగాహన లేకే ఇలా పొరపాటు పడి ఉండొచ్చు. విక్రమ్, సామ్రాట్ పృథ్విరాజ్ లతో పోటీ పడుతున్న మేజర్ కు మంచి హైపే ఏర్పడుతోంది. కంటెంట్ కనెక్ట్ అయితే బ్లాక్ బస్టర్ ఖాయమే.