బాలయ్యకు జోడీగా ప్రియమణి

‘అఖండ’తో మళ్లీ ఫాంలోకి వచ్చాడు సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ. ఈ సినిమా అఖండ విజయం సాధించడానికి తోడు.. బాలయ్య మళ్లీ ట్రాక్ తప్పకుండా క్రేజీ ప్రాజెక్టులు లైన్లో పెడుతుండటం అభిమానులకు అమితానందాన్నిస్తోంది. ‘క్రాక్’తో బ్లాక్‌బస్టర్ కొట్టిన గోపీచంద్ మలినేనితో ఆయన ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత మరో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌తో సినిమాను ఓకే చేశాడు.

ఆ దర్శకుడెవరో కాదు.. ఇప్పటిదాకా అపజయం ఎరుగని అనిల్ రావిపూడి. వీరి కలయిక గురించి చాలా కాలం నుంచి వార్తలు వస్తున్నాయి కానీ.. ఎట్టకేలకు కాంబినేషన్ ఓకే అయింది. బాలయ్యతో తాను చేయబోయే సినిమా గురించి అనిల్ చెబుతున్న మాటలు అభిమానులను ఉత్కంఠకు గురి చేస్తున్నాయి.

బాలయ్య కోసం అదిరిపోయే క్యారెక్టర్ రాస్తున్నానని.. సినిమాను డ్రైవ్ చేసే పాత్ర అదని.. బాలయ్య నడి వయస్కుడిగా కనిపించబోతున్నాడని.. తన కెరీర్లో చాలా కొత్తగా, అలాగే ది బెస్ట్ అనిపించేలా ఈ పాత్ర, సినిమా ఉంటాయని అనిల్ చెప్పడం తెలిసిందే. అంతే కాక ఈ చిత్రంలో బాలయ్య కూతురిగా ‘పెళ్ళిసంద-డి’ బామ శ్రీ లీల నటించబోతున్నట్లు కూడా అనిల్ వెల్లడించాడు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ బయటికి వచ్చింది. ఇందులో బాలయ్యకు జోడీగా ప్రియమణి నటించనుందట. మామూలుగా చూస్తే ఈ టైంలో బాలయ్యకు జోడీగా ప్రియమణి ఏంటి అనిపిస్తుంది కానీ.. ఇందులో బాలయ్య చేస్తున్నది నడి వయస్కుడి పాత్ర కాబట్టి ఆమె కరెక్ట్ ఛాయిసే.

నారప్పలో వెంకీ పాత్రకు తగ్గట్లే ఆమెతో బాగా జోడీ కుదిరింది. నడి వయస్కుడైన బాలయ్య పక్కన కూడా ఆమె బాగానే సూట్ కావచ్చు. ఇంతకుముందు బాలయ్య, ప్రియమణి కలిసి ‘మిత్రుడు’ అనే సినిమా చేశారు. బాలయ్య బ్యాడ్ ఫాంలో ఉన్నపుడు చేసిన ఆ బ్యాడ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. ఈసారి ఈ ఇద్దరి కలయికలో ఒక బ్లాక్‌బస్టర్ వస్తుందని ఆశిద్దాం.