మాస్ రాజాతో తమిళ దర్శకుడు?

హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసబెట్టి సినిమాలు చేసుకుపోతుంటాడు మాస్ రాజా రవితేజ. వరుస ఫ్లాపులు వచ్చినపుడు కూడా అతను జోరు తగ్గించింది లేదు. ఇక ‘క్రాక్’తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాక మాస్ రాజా తగ్గుతాడా? ఆ సినిమా తర్వాత మరింత దూకుడు మీదున్నాడు.

ఆల్రెడీ ‘ఖిలాడి’తో పలకరించిన అతను.. త్వరలోనే ‘రామారావు’ సినిమాతో బాక్సాఫీస్ డ్యూటీ ఎక్కనున్నాడు. దీంతో పాటుగా రవితేజ.. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే పాన్ ఇండియా సినిమాకు కూడా మాస్ రాజా శ్రీకారం చుట్టాడు.

మరోవైపు బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న సినిమాలోనూ మాస్ రాజా ప్రత్యేక పాత్ర నటించనున్నట్లు వార్తలు రావడం తెలిసిందే. ఇన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉన్న మాస్ రాజా.. తాజాగా మరో కొత్త చిత్రాన్ని ఓకే చేసినట్లు సమాచారం.

ఈసారి రవితేజ ఓ తమిళ దర్శకుడితో జట్టు కట్టబోతున్నాడట. ఆ దర్శకుడే.. బాలాజీ మోహన్. సిద్దార్థ్ హీరోగా ‘లవ్ ఫెయిల్యూర్’తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలాజీ మోహన్.. ఆ తర్వాత ధనుష్ హీరోగా ‘మారి’, ‘మారి-2’ చిత్రాలు తీశాడు. ఇవి రెండూ బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించాయి. ఇటీవలే బాలాజీ ఓ వెబ్ సిరీస్‌ను మొదలుపెట్టాడు. దీని తర్వాత రవితేజ హీరోగా ఓ సినిమా చేయడానికి అతను ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అతను చెప్పిన కథకు మాస్ రాజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.

‘టైగర్ నాగేశ్వరరావు’తో ఎలాగూ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు మాస్ రాజా. తర్వాత తమిళ దర్శకుడితో సినిమా అంటే అది కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ఉండొచ్చు. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఐతే పరభాషా దర్శకులు, అక్కడి కథలతో మాస్ రాజాకు చేదు అనుభవాలున్నాయి.

తమిళ హిట్ల ఆధారంగా తెరకెక్కిన ‘నా ఆటోగ్రాఫ్’, ‘శంభో శివ భంభో’ అతడికి నిరాశను మిగిల్చాయి. ఇందులో ‘శంభో శివ శంభో’ను డైరెక్ట్ చేసింది తమిళ దర్శకుడైన సముద్రఖనినే రూపొందించాడు. మరి బాలాజీ మోహన్ మాస్ రాజాకు ఎలాంటి సినిమా ఇస్తాడో చూడాలి.