సలార్ ఎంత అయింది.. కేజీఎఫ్-3 ఎప్పుడు?

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ జాబితాలో ‘సలార్’ కచ్చితంగా ఉంటుంది. ‘బాహుబలి’తో తిరుగులేని ఇమేజ్ సంపాదించిన ప్రభాస్‌తో ‘కేజీఎఫ్’తో ప్రకంపనలు రేపిన ప్రశాంత్ నీల్ సినిమా చేస్తుండటంతో దీనిపై అంచనాలు మామూలుగా లేవు.

ఐతే ఈ చిత్రం ఏడాది కిందటే సెట్స్ మీదికి వెళ్లినా.. షూటింగ్ ఆగి ఆగి సాగుతోంది. ప్రశాంత్.. ‘కేజీఎఫ్-2’తో, ప్రభాస్ ‘రాధేశ్యామ్’తో బిజీగా ఉండటం అందుకు కారణం. ఐతే ఈ రెండు చిత్రాలూ నెల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. హీరో, డైరెక్టర్ ఇద్దరూ కూడా ఇప్పుడు ఫ్రీ అయిపోయారు.

త్వరలోనే కొత్త షెడ్యూల్ మొదలు కాబోతోంది. ఐతే చాన్నాళ్లుగా వార్తల్లో లేని ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి నిర్మాత, హోంబలె ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరగందూర్ ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటిదాకా ‘సలార్’ చిత్రీకరణ 35 శాతం పూర్తయినట్లు అతను వెల్లడించాడు.

ఇక నుంచి షూటింగ్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని, అక్టోబరు-నవంబరు కల్లా షూట్ పూర్తి కావచ్చని విజయ్ తెలిపాడు. వచ్చే వేసవికి ‘సలార్’ ప్రేక్షకుల ముందుకు రావొచ్చని అతను సంకేతాలిచ్చాడు. మరోవైపు ‘కేజీఎఫ్-3’ గురించి కూడా విజయ్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చాడు.

ఈ సినిమాతో మార్వెల్ తరహాలో ఇండియన్ ప్రేక్షకుల కోసం ఒక కొత్త ప్రపంచాన్ని తీర్చిదిద్దాలన్నది తమ ఉద్దేశమని.. కాబట్టి ‘కేజీఎఫ్-3’ కచ్చితంగా ఉంటుందని.. ఈ చిత్రాన్ని2024లో రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నామని.. వచ్చే ఏడాది చిత్రీకరణ మొదలవుతుందని విజయ్ చెప్పాడు.

‘కేజీఎఫ్-2’ రిజల్ట్ తేడా కొట్టి ఉంటే ఏమో కానీ.. ఈ చిత్రం అంచనాలను మించిపోయి వరల్డ్ వైడ్ రూ.1100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన నేపథ్యంలో సీక్వెల్ తీయకుండా ఎలా ఉంటారు? ఇంకో సీక్వెల్ గురించి ‘కేజీఎఫ్-2’ చివర్లో సంకేతాలు ఇవ్వడం తెలిసిందే.