మహేష్ క్యారెక్టర్.. కొంచెం చూసుకోవాల్సింది


భారీ అంచనాలతో గురువారం థియేటర్లలోకి దిగిన సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’ తొలి రోజు మంచి వసూళ్లే సాధించింది. మహేష్ కెరీర్లో ఇది హైయెస్ట్ డే-1 గ్రాసర్‌గా నిలవడం విశేషం. ఐతే సినిమా అనుకున్న స్థాయిలో లేదన్నది మెజారిటీ ప్రేక్షకుల మాట. అలాగని సినిమా తీసిపడేసేలా కూడా లేదు. టైంపాస్ ఎంటర్టైన్మెంట్‌కు ఢోకా లేని చిత్రమే ఇది. మహేష్ వరకు తన అభిమానులను బాగానే అలరించాడు.

ఐతే ఇంత పెద్ద స్టార్ తనను నమ్మి అవకాశం ఇస్తే దర్శకుడు పరశురామ్ ఇంకా మెరుగైన సినిమా చేయాల్సిందన్నది విశ్లేషకుల మాట. ‘గీత గోవిందం’తో ఆశ్చర్యానికి గురి చేసిన అతను.. అందులో మాదిరి కథాకథనాల్లో పట్టు చూపించలేకపోయాడు. కామెడీ వరకు ఓకే అనిపించినా.. కథాకథనాల్లో బిగి లేదు. చాలా చోట్ల లాజిక్ మిస్ అయింది. ముఖ్యంగా ప్రధాన పాత్రలను తీర్చిదిద్దిన విధానంలో పరశురామ్ మార్కు కనిపించలేదు.

పరశురామ్ ఫ్లాప్ సినిమాల్లో కూడా హీరో పాత్రలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. కానీ మహేష్ లాంటి హీరోకు తన స్థాయికి తగ్గ పాత్రను పరశురామ్ డిజైన్ చేయలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహేష్ చేసిన మహి పాత్రలో చాలా లాజిక్‌లు మిస్ కావడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

హీరో యుఎస్‌లో ఏమో వడ్డీ వ్యాపారం చేస్తూ.. తన వడ్డీ, వాయిదాల విషయంలో చాలా కఠినంగా ఉంటాడు. చిన్న తేడా వచ్చినా విశ్వరూపం చూపిస్తాడు. కేవలం 10 వేల డాలర్ల కోసం అతను ఇండియాకు వచ్చేస్తాడు. కానీ ఇండియాకు వచ్చాకేమో ఇక్కడ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్న వాళ్లు ఈఎంఐలు కట్టకూడదని పోరాటం చేస్తాడు. దీని చుట్టూనే ప్రిక్లైమాక్స్, క్లైమాక్స్ నడుస్తాయి. హీరో పాత్రలో ఇంత వైరుధ్యం ఉండడమేంటో అర్థం కాదు.

మరోవైపు హీరోకు ఇందులో డైరెక్ట్ రివెంజ్ ఉండదు. విలన్ వల్ల ఇబ్బంది పడ్డ బ్యాంకు అధికారి పాత్ర బాధ విని.. ఆమెను కాపాడ్డానికన్నట్లు రంగంలోకి దిగుతాడు. తీరా చూస్తే ఆ పాత్ర వల్లే అతడి తల్లిదండ్రులు చనిపోయి ఉంటారు. అంటే పరోక్షంగా తన తల్లిదండ్రుల చావుకు కారణమైన వ్యక్తి తాలూకు సమస్యను హీరో టేకప్ చేసి విలన్ మీదికి దండెత్తుతాడు. ఇలా హీరో వేరొకరి ప్రతీకారాన్ని టేకప్ చేయడం వల్ల ప్రేక్షకులు ఎమోషన్ ఫీల్ కాలేకపోయారు. ఇలా హీరో క్యారెక్టర్లో లోపాల వల్ల ‘సర్కారు వారి పాట’ అనుకున్నంత ఎఫెక్టివ్‌గా కనిపించడం లేదన్నది విశ్లేషకుల మాట.