చిరంజీవిపై కోట తీవ్ర వ్యాఖ్యలు

మెగా ఫ్యామిలీతో ఎప్పుడు, ఎందుకు చెడిందో కానీ.. ఈ మధ్య లెజెండరీ నటుడు కోట శ్రీనివాసరావు ఆ కుటుంబ వ్యక్తుల మీద మంటెత్తిపోతున్నారు. కొన్ని నెలల కిందట ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఎన్నికల సందర్భంగా ఆయన నాగబాబును ఉద్దేశించి తీవ్ర విమర్శలే చేశారు. చిరంజీవిని కూడా కొన్ని విషయాల్లో తప్పుబట్టారు. ఇప్పుడు ఆయన చిరంజీవి మీద ఓ ఇంటర్వ్యూలో తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఇటీవల ‘మే డే’ ఉత్సవాల్లో భాగంగా చిరంజీవి ప్రసంగం విషయంలో కోట అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అందులో చిరు మాట్లాడిన ఒక్కో మాటను పట్టుకుని విమర్శలు చేశారు. చిత్రపురి కాలనీలో ఆసుపత్రి కట్టించాలనుకుంటున్నట్లు చిరు చెప్పిన మంచి విషయం మీద కోట ఆ ఇంటర్వ్యూలో ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ముందు కార్మికులకు తిండి పెట్టాలని.. చిరంజీవి కట్టే ఆసుపత్రికి ఎవరొస్తారని కోట ప్రశ్నించారు. ప్రతిభ వుండి కూడా ఎంతోమంది పని లేక కృష్ణానగర్‌లో ఆకలితో అలమటించడమే కాకుండా వ్యసనాల బారినపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని.. వాళ్ల దగ్గర డబ్బులుంటే అపోలో ఆసుపత్రికి వెళ్తారు కానీ.. చిరంజీవి కట్టే ఆసుపత్రికి ఎందుకు వెళ్తారని శ్రీనివాసరావు అన్నారు. ఇక మే డే వేడుకల్లో భాగంగా తాను సినీ కళాకారుడిని కాదని, కార్మికుడినని చిరు వ్యాఖ్యానించడాన్ని కోట తప్పుబట్టారు. కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే చిరంజీవి సినీ కార్మికుడు ఎలా అవుతారని ఆయన ప్రశ్నించారు. తనకు అలాంటి మాటలు నచ్చవని.. కానీ చిరంజీవి అంటే ఎంతో గౌరవమని కోట పేర్కొనడం గమనార్హం.

ఇక చిరంజీవి సేవా భావం గురించి కోట వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కార్మికుడినని చెప్పుకుంటున్న చిరంజీవి ఎవరికైనా ఏనాడైనా రూపాయి సాయం చేశారా … ఆయన సినిమాల్లో ఎవరికైనా వేషాలు ఇప్పించారా అని కోట ప్రశ్నించారు. తన ఇంటికి సాయం కోసం వచ్చే వారికి 500, 1000 ఇచ్చి పంపుతుంటానని.. ఇలా ఇబ్బందుల్లో ఉన్న కార్మికుల కోసం రూ.5 లక్షల దాకా సాయం చేశానని.. అంతే కానీ నేను ఇది చేస్తా, అది చేస్తానని చెప్పనని కోట వ్యాఖ్యానించారు. గతంలో ‘మా’ కోసం కూడా విరాళాలు ఇచ్చానని, షుగర్ పేషెంటైన తాను తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం వృద్ధాప్యంలోనూ నాలుగు రోజుల పాటు నిరాహార దీక్ష చేశానని కోటా గుర్తుచేశారు. అసందర్భంగా కోట ఇలా చిరును టార్గెట్ చేయడం చూస్తే ఆయనకు వ్యక్తిగతంగా ఏదైనా చెడిందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి.