మా వ‌ల్ల కాదు.. ఖాన్‌లే చూసుకోవాలి


90వ ద‌శ‌కం నుంచి బాలీవుడ్‌లో ఖాన్‌ల‌దే హ‌వా. దాదాపు పాతికేళ్ల పాటు షారుఖ్ ఖాన్‌, స‌ల్మాన్ ఖాన్‌, ఆమిర్ ఖాన్ తిరుగులేని ఆధిప‌త్యం చ‌లాయించారు. వీరి మ‌ధ్య గ‌ట్టి పోటీ ఉండేది. ఒక్కో టైంలో ఒక్కొక్క‌రు ఆధిప‌త్యం చ‌లాయించారు త‌ప్ప‌.. వేరే వాళ్ల‌కు పెద్ద‌గా అవ‌కాశం ఇవ్వ‌లేదు. కానీ గ‌త కొన్నేళ్ల‌లో ప‌రిస్థితులు మారాయి. షారుఖ్ ఖాన్ బాగా డౌన్ అయిపోయాడు. స‌ల్మాన్ కెరీర్ కూడా ఒడుదొడుకుల‌తో సాగింది. ఆమిర్ ఖాన్ థ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్‌తో గ‌ట్టి ఎదురు దెబ్బ తిన్నాడు. అదే టైంలో అక్ష‌య్ కుమార్, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, షాహిద్ క‌పూర్, ర‌ణ్వీర్ సింగ్ లాంటి హీరోలు రైజ్ అయ్యారు.

వీరి చిత్రాలు కొన్ని ఘ‌న‌విజ‌యం సాధించి వాళ్ల ఇమేజ్‌ను పెంచాయి. ఖాన్‌ల ఆధిప‌త్యాన్ని త‌గ్గించాయి. ఐతే క‌రోనా దెబ్బ‌కు అంద‌రి మార్కెట్లూ దెబ్బ తినేశాయి. మొత్తంగా బాలీవుడ్ మీదే ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డింది. క‌రోనా బ్రేక్ త‌ర్వాత పుంజుకోవ‌డానికి బాలీవుడ్ ఎంత ప్ర‌య‌త్నిస్తున్నా ఫ‌లితం లేక‌పోతోంది.

ఒక్క సూర్య‌వంశీ మిన‌హాయిస్తే స్టార్ల సినిమాలేవీ స‌రిగా ఆడ‌లేదు. సూర్య‌వంశీ కూడా ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో ఆడింది. దీని హీరో అక్ష‌య్ కుమార్ నుంచి క‌రోనా బ్రేక్ త‌ర్వాత వ‌చ్చిన బెల్ బాట‌మ్‌, బ‌చ్చ‌న్ పాండే అడ్ర‌స్ లేకుండా పోయాయి. ఇక తానాజీతో క‌రోనాకు ముందు భారీవిజ‌యాన్నందుకున్న‌ అజ‌య్ దేవ‌గ‌ణ్.. ఇప్పుడు ర‌న్‌వే 34తో ప్రేక్ష‌కుల ముందుకు రాగా తిర‌స్కారం త‌ప్ప‌లేదు. సింబాతో గ‌తంలో 200 కోట్ల క్ల‌బ్బును అందుకున్న‌ ర‌ణ్వీర్ సింగ్ 83 సినిమాతో చేదు అనుభ‌వం ఎదుర్కొన్నాడు. క‌బీర్ సింగ్‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టిన షాహిద్.. ఇప్పుడు జెర్సీతో డిజాస్ట‌ర్‌ను ఖాతాలో వేసుకున్నాడు. వీళ్లెవ్వ‌రూ బాలీవుడ్‌ను రివైవ్ చేయ‌లేక‌పోయారు. వీళ్లంద‌రూ చేతులెత్తేసిన ప‌రిస్థితుల్లో ఆశ‌ల‌న్నీ ఖాన్స్ మీదే నిలిచాయి.

ఆగ‌స్టులో ఆమిర్ సినిమా లాల్ సింగ్ చ‌ద్దా రాబోతోంది. ఏడాది చివ‌ర్లో స‌ల్మాన్ సినిమా టైగ‌ర్‌-3, షారుఖ్ మూవీ ప‌ఠాన్ రిలీజ్ కానున్నాయి. ఇవి వ‌చ్చి మ‌ళ్లీ హిందీ ప్రేక్ష‌కుల‌ను బాలీవుడ్ వైపు మ‌ళ్లిస్తే త‌ప్ప సౌత్ సినిమాల తాకిడి త‌ట్టుకుని నిల‌బ‌డ‌టం క‌ష్ట‌మ‌ని అక్క‌డి ట్రేడ్ పండిట్లు భావిస్తున్నారు.