ఆ ప‌దం వాడినందుకు సారీ: విశ్వ‌క్సేన్

యువ క‌థానాయ‌కుడు విశ్వ‌క్సేన్ ఈ రోజుల్లో వార్త‌ల్లో వ్య‌క్తి అయ్యాడు. త‌న కొత్త సినిమా అశోక‌వ‌నంలో అర్జున క‌ళ్యాణం ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా అత‌ను చేసిన ఒక ప్రాంక్ వీడియో మీద టీవీ9 ఛానెల్లో డిబేట్ న‌డ‌వ‌డం.. అక్క‌డికి విశ్వ‌క్ వెళ్ల‌డం.. యాంక‌ర్ దేవి నాగ‌వ‌ల్లికి, అత‌డికి వాగ్వాదం జ‌ర‌గ‌డం.. ఆమె అత‌ణ్ని గెటౌట్ అన‌డం.. అత‌ను ఒక ఎఫ్ వ‌ర్డ్ వాడి కోపంగా స్టూడియో నుంచి బ‌య‌టికి వ‌చ్చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఈ వ్య‌వ‌హారంలో ఎవ‌రిది త‌ప్పు అనే విష‌యంలో ఉద‌యం నుంచి పెద్ద చ‌ర్చే న‌డిచింది. విశ్వ‌క్ మీద వ్య‌క్తిగ‌త స్థాయిలో దాడి చేస్తూ యాంక‌ర్ వాడిన కొన్ని ప‌దాలు, అలాగే గెటౌట్ అన‌డాన్ని అంద‌రూ త‌ప్పుబ‌ట్టారు. అదే స‌మ‌యంలో విశ్వ‌క్ వాడిన ఎఫ్ వర్డ్ విష‌యంలోనూ అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు. ఈ చ‌ర్చ ఇలా న‌డుస్తుండ‌గానే రాత్రి అశోక‌వ‌నంలో అర్జున క‌ళ్యాణం టీం ప్రెస్ మీట్ పెట్టి మీడియాను క‌లిసింది.
ఈ సంద‌ర్భంగా విలేక‌రులు టీవీ9 స్టూడియోలో జ‌రిగిన ర‌చ్చ గురించి ప్ర‌స్తావించారు.

విశ్వ‌క్ వాడిన ఎఫ్ వ‌ర్డ్ గురించి అడిగారు. దీనికి విశ్వ‌క్ బ‌దులిస్తూ.. దెబ్బ త‌గిలిన‌పుడు అమ్మా అని అరుస్తాం క‌దా, అదే త‌ర‌హాలో త‌న నోటి నుంచి ఆ మాట వ‌చ్చేసింది అన్నాడు. 16 ఏళ్లు దాటిన యూత్ అంతా ఇప్పుడు ఆ ప‌దం వాడ‌టం కామ‌న్ అయిపోయింద‌ని, తాను కూడా అలాగే పెద్ద‌గా ఆలోచించ‌కుండా ఆ మాట అనేశాన‌ని విశ్వ‌క్ వివ‌ర‌ణ ఇచ్చాడు. ఐతే మీడియా వ్య‌క్తి మీద‌ ఇలాంటి ప‌దం వాడినందుకు తాను ప‌శ్చాత్తాప‌ప‌డుతున్నాన‌ని.. దీనిపై సారీ చెబుతూ.. ఆల్రెడీ ఒక నోట్ ప్రిపేర్ చేశాన‌ని.. దాన్ని రేపు పోస్ట్ చేస్తాన‌ని చెప్పాడు.

ఐతే ఈ ప‌దం వాడ‌టం త‌ప్పితే.. మిగ‌తా ఏ విష‌యంలోనూ త‌న‌కు ప‌శ్చాత్తాపం లేద‌ని, తాను ఇంకే త‌ప్పూ చేయ‌లేద‌ని అత‌న‌న్నాడు. ఇక త‌న‌కున్న యారొగెంట్ ఇమేజ్ గురించి మాట్లాడుతూ.. ఫ‌ల‌క్ నుమా దాస్ నుంచి ఆ ఇమేజ్ అలా కొన‌సాగుతోంద‌ని, త‌న తొలి చిత్రం వెళ్లిపోమాకే చూసి ఉంటే త‌న ప‌ట్ల వేరే అభిప్రాయం ఉండేద‌ని.. ప‌రిచ‌యం లేని జ‌నాల‌కు తాను యారొగెంట్ అనిపించినా, స‌న్నిహితంగా ఉండేవారికి తానెంత మంచివాడో తెలుస్తుంద‌ని, త‌న గురించి తెలిస్తే ఇంటికి తీసుకెళ్లి పెంచేసుకుంటార‌ని విశ్వ‌క్ వ్యాఖ్యానించ‌డం విశేషం.