ఇది ఎప్ప‌టికీ మాన‌ని మెగా గాయం

భ‌ర‌త్ అనే నేను త‌ర్వాత కొర‌టాల శివ.. రామ్ చ‌ర‌ణ్ సోలో హీరోగా సినిమా చేయాల‌నుకున్నార‌ట‌. కానీ అప్ప‌టికే ఆర్ఆర్ఆర్ క‌మిటై ఖాళీ లేకుండా ఉండ‌డంతో చ‌ర‌ణ్ బ‌దులు త‌న‌తో సినిమా చేయాల‌ని చిరు అడ‌గ‌డం, మెగాస్టార్‌తో సినిమా చేసే అవ‌కాశం వ‌చ్చింద‌ని కొర‌టాల మ‌రింత సంతోషించ‌డం, ఆ త‌ర్వాత కీల‌క పాత్ర‌కు రామ్ చ‌ర‌ణ్‌ను తీసుకోవ‌డం జ‌రిగాయి. నిజానికి ఇందులో స్పెష‌ల్ రోల్ చేయ‌డానికి కూడా చ‌ర‌ణ్‌కు ఖాళీ లేక‌పోయినా.. త‌న భ‌ర్త‌, కొడుకుల‌ను ఒకే సినిమాలో చూడాల‌న్న సురేఖ కోరిక మేర‌కు చ‌ర‌ణ్ ఎలాగోలా వీలు చేసుకుని ఈ సినిమాలో న‌టించ‌డం జ‌రిగింది.

త‌న భార్య క‌ల ఇది అని చెప్పి రాజ‌మౌళికి స్వ‌యంగా చిరునే చెప్పి ఈ సినిమాలో త‌న కొడుకు న‌టించేలా చూసిన‌ట్లు వెల్ల‌డంచ‌డం తెలిసిందే. దీన్ని బ‌ట్టి ఆచార్య చిరు కుటుంబానికి ఎంత స్పెష‌లో అర్థం చేసుకోవ‌చ్చు.
ఇంత‌కుముందు మ‌గ‌ధీర‌లో చిరు ఒక ఐదు నిమిషాలు సంద‌డి చేసినా.. అదో చిన్న క్యామియో మాత్ర‌మే. పైగా చిరు అప్ప‌టికి సినిమాల‌కు దూరంగా ఉన్నారు.

కానీ ఆచార్య‌లో ఇద్ద‌రూ పూర్తి స్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకుంటుండ‌టంతో దీన్ని ఇటు మెగా ఫ్యామిలీ.. అటు మెగా అభిమానులు చాలా ప్ర‌త్యేకంగా చూశారు. వాళ్లిద్దరినీ వెండితెర‌పై చూడ‌టానికి త‌హ‌త‌హ‌లాడారు. ఈ చిత్రం ఎప్ప‌టికీ మ‌రిచిపోలేని తీపి గుర్తు అవుతుంద‌ని అంచ‌నా వేశారు. కానీ తీరా చూస్తే క‌థ అడ్డం తిరిగింది. ఇక‌పై ఆచార్య గురించి మాట్లాడుకోలేని, దాన్ని గుర్తు చేసుకోలేని ప‌రిస్థితి వ‌చ్చేలా ఉంది.

టాలీవుడ్లో అతి పెద్ద డిజాస్ట‌ర్ల‌లో ఒక‌టిగా ఆచార్య నిల‌వ‌బోతోంది. 60-70 కోట్ల మ‌ధ్య న‌ష్టం అంటున్నారు. ఇది ఎవ్వ‌రూ ఊహించ‌ని విష‌యం. సినిమా కాస్త త‌గ్గినా.. మ‌హా అయితే ఆచార్య కొర‌టాల గ‌త సినిమాల స్థాయిలో బ్లాక్‌బస్ట‌ర్ కాదేమో అనుకున్నారు కానీ.. ఓ మోస్త‌రు విజ‌య‌మైనా సాధిస్తుంద‌నే అంచ‌నా వేశారు. కానీ ఇప్పుడిది ఇంత పెద్ద డిజాస్ట‌ర్ అయి చిరు-చ‌ర‌ణ్‌ల క‌ల‌యిక‌ను ఒక గాయంలా మార్చేయ‌డం మెగా అభిమానుల‌కు తీర‌ని వేద‌న క‌లిగించేదే.