రాధికతో చిరంజీవి.. న్యూ ప్రాజెక్ట్!

‘ఆచార్య’తో తాజాగా ప్రేక్షకులను పలకరించిన మెగాస్టార్ చిరంజీవి చేతిలో కొత్తగా నాలుగు సినిమాలున్నాయి. గాడ్‌ఫాదర్, భోళా శంకర్‌లకు తోడు బాబీ చిత్రంలోనూ నటిస్తున్న చిరు.. వెంకీ కుడుములతోనూ ఓ సినిమాకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ వయసులో ఇన్ని సినిమాల్లో నటిస్తున్నారేంటి అని ఇటీవల ‘ఆచార్య’ ప్రి రిలీజ్ ఇంటర్వ్యూ ఒకదాంట్లో చిరును అడిగితే.. తాను ఇంకో ఐదు సినిమాలను ఓకే చేసినట్లుగా చెప్పి షాకిచ్చాడు మెగాస్టార్.

ఆయన తమాషాకు ఆ మాట అన్నారా.. సీరియస్సా అనేది జనాలకు అర్థం కాలేదు. ఐతే ఇంకో ఐదు సినిమాల మాటేమో కానీ.. అందులో ఒక చిత్రం అయితే నిజంగానే ఓకే అయినట్లుంది. ఆ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక సమాచారం కూడా బయటికి వచ్చేసింది. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరన్నది తెలియదు కానీ.. నిర్మాత మాత్రం ఖరారయ్యారు. ఒకప్పుడు చిరుతో బోలెడన్ని సినిమాలు చేసిన సీనియర్ నటి రాధిక నిర్మాణంలో చిరు నటించబోతున్నాడు.

సినిమాలు తగ్గిపోయాక రాడాన్ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో బేనర్ పెట్టి చాలా సీరియళ్లు నిర్మించింది రాధిక. టెలివిజన్ రంగంలో ఆమె సంస్థ ఒక ట్రెండ్ సెట్టర్ అనడంలో సందేహం లేదు. ‘రహస్యం’ మొదలుకుని ఎన్నో సీరియళ్లు సూపర్ హిట్టయ్యాయి. టీవీ రంగంలో ఈ సంస్థ చూసిన ఎత్తులను మరే బేనర్ కూడా చూడలేదు అంటే అతిశయోక్తి కాదు. తర్వాత ఈ బేనర్ మీద ఆమె కొన్ని సినిమాలను కూడా నిర్మించింది. ఐతే ఇప్పుడు ఏకంగా మెగాస్టార్‌తో రాడాన్‌లో ఓ సినిమా చేయబోతున్నట్లు రాధిక వెల్లడించారు. ‘‘రాడాన్‌లో సినిమా చేయడానికి అంగీకరించిన ప్రియమైన చిరంజీవికి కృతజ్ఞతలు. సమీప భవిష్యత్తులో ఈ సినిమా ఉంటుంది. కింగ్ ఆఫ్ మాస్‌తో బ్లాక్‌బస్టర్ చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం’’ అని రాధిక ట్విట్టర్లో పేర్కొన్నారు.

రాధిక, ఆమె భర్త శరత్ కుమార్‌తో చిరుకు ఎంతో సాన్నిహిత్యం ఉంది. 90ల్లో శరత్ కెరీర్ ఆరంభంలో ఒడుదొడుకుల్లో ఉన్నపుడు ‘గ్యాంగ్ లీడర్’లో అవకాశం ఇప్పించాడు. అలాగే అతడి నిర్మాణంలో ఓ సినిమా చేయడానికి కూడా ముందుకొచ్చాడు. ఐతే ఈలోపు శరత్ తమిళంలో హీరోగా నిలదొక్కుకున్నాడు. దీంతో శరత్ కుమార్ ప్రొడక్షన్లో సినిమా కార్యరూపం దాల్చలేదు. మళ్లీ ఇన్నేళ్లకు శరత్ భార్య రాధిక నిర్మాణంలో చిరు సినిమా చేయబోతున్నాడన్నమాట.