చిరు.. ఇంకో ఐదు ఓకే చేశాడట

సెకండ్ ఇన్నింగ్స్‌లో మెగాస్టార్ చిరంజీవి మామూలు స్పీడులో లేడు. ‘ఆచార్య’ కరోనా, ఇతర కారణాల వల్ల ఆలస్యం అయింది కానీ.. దీని తర్వాత మాత్రం ఆయన శరవేగంగా సినిమాలు పూర్తి చేయడానికి ప్రణాళికలు రచించుకున్నారు. గాడ్ ఫాదర్, భోళా శంకర్, బాబీ సినిమా.. ఇలా సమాంతరంగా ఆయన మూడు చిత్రాల షూటింగ్‌లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలోనూ చిరు ఓ సినిమాను ఓకే చేశారు.

‘ఆచార్య’తో కలుపుకుంటే ఆయన చేతిలో ఐదు సినిమాలు ఉన్నట్లు. ఈ వయసులో ఇంత బిజీగా ఉంటూ ఇంత ఉత్సాహంగా ఎలా పని చేయగలుగుతున్నారు అని చిరును ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే.. ఆయన ఒక షాకింగ్ విషయం చెప్పారు. తాను కొత్తగా ఇంకో ఐదు సినిమాలు కమిటైనట్లు  వెల్లడించారు. ఇలా విరామం లేకుండా సినిమాలు చేయడం తనకేమీ కష్టంగా అనిపించట్లేదని ఆయన చెప్పారు.

‘‘ఇప్పుడు నా చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయనే అంతా అనుకుంటున్నారు. ఇవి కాకుండా ఇంకో ఐదు సినిమాలు సిద్ధమవుతున్నాయి. మేమంతా ఎంతో పుణ్యం చేసుకోబట్టే సినిమా రంగంలోకి వచ్చాం. ఇక్కడికి వచ్చి నిలదొక్కుకున్న తర్వాత ఎంత సంతోషిస్తామో.. ఈ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోతే అంత బాధ పడతాం. కాబట్టి మన స్థానం నిలబెట్టుకోవడం కోసం నిరంతరం కష్టపడాల్సిందే. 24 గంటలూ పని చేసినా నాకు విసుగురాదు.

నా కష్టమే నన్ను ఆరోగ్యవంతుడిని చేస్తుంది. నేను కష్టపడేంత వరకు ఈ ఇండస్ట్రీ నన్నెప్పుడూ అక్కున చేర్చుకుంటుందని నమ్ముతాను. ‘గాడ్ ఫాదర్’ కోసం రాత్రి పూట పని చేశాం. బాబీ సినిమాకు కూడా రాత్రుళ్లే షూటింగ్ జరిగంది. నాకు ఎక్కడా విసుగు రాలేదు. మరింత ఉత్సాహం వస్తుంది’’ అని చిరు చెప్పాడు. మరి ఇంకో ఐదు సినిమాలని చిరు సరదాకి అన్నాడా.. లేక నిజంగానే ఆయన ఇంకో ఐదు సినిమాలు లైన్లో పెట్టాడా అన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది.