బాకీ సెటిల్ చేయడానికి బేనర్ మారిందా?

టాలీవుడ్ యువ విజయ్ దేవరకొండ తన గత చిత్రాల ఫలితాలతో సంబంధం లేకుండా మంచి ఊపుమీదున్నాడిప్పుడు. ‘లైగర్’ పూర్తి చేశాక ఆ చిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్‌తోనే ‘జేజీఎం’ (జనగణమన) అనే కొత్త సినిమాను విజయ్ మొదలుపెట్టడం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగానే.. ఇంకో కొత్త సినిమాను మొదలుపెట్టేశాడు. నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీష్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణతో అతడి కొత్త చిత్రం తాజాగా మొదలైన సంగతి తెలిసిందే. సమంత కథానాయికగా నటించనున్న ఈ చిత్రానికి ‘ఖుషి’ అనే క్లాసిక్ టైటిల్‌ను అనుకుంటున్నట్లుగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.

నిజానికి ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాల్సింది. విజయ్-శివ కాంబినేషన్ గురించి ముందుగా వార్తలు వచ్చినపుడు నిర్మాతగా రాజు పేరే వినబడింది. విజయ్‌తో సినిమా చేయాలని ఎప్పట్నుంచో చూస్తున్న దిల్ రాజు.. ఈ చిత్రంతోనే తమ బేనర్లో అతణ్ని నటింపజేస్తున్నట్లు చెప్పుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో విజయ్-శివ సినిమా మొదలైంది. విజయ్‌తో మైత్రీ వాళ్లకున్న పాత బాకీల నేపథ్యంలోనే ఈ సినిమా వారి చేతికి వెళ్లినట్లు తెలుస్తోంది.

రౌడీ హీరోతో ఇంతకుముందు మైత్రీ వాళ్లు ‘డియర్ కామ్రేడ్’ సినిమాను నిర్మించారు. కేవలం విజయ్ మీద నమ్మకంతో కొత్త దర్శకుడైన భరత్ కమ్మ ఈ చిత్రంపై భారీగా ఖర్చు చేయించినా సర్దుకున్నారు. తీరా చూస్తే ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ చిత్రం సెట్స్ మీద ఉండగానే విజయ్.. ఓ తమిళ దర్శకుడితో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తే దానికి భారీ బడ్జెట్ పెట్టడానికి ముందుకొచ్చారు.

‘హీరో’ పేరుతో అనౌన్స్ అయిన ఆ చిత్రం షూటింగ్ ఆరంభ దశలో ఉండగానే ఆగిపోయింది. ఆ కొన్ని రోజుల షూటింగ్‌కు కొన్ని కోట్లు ఖర్చయ్యాయి. ఇలా ఈ రెండు సినిమాలతో మైత్రీ అధినేతలకు బాగా నష్టం వచ్చింది. దాన్ని భర్తీ చేయడానికి ఇంకో సినిమా చేస్తానని విజయ్ ఎప్పుడో మాట ఇచ్చాడు. శివ సినిమా మీద తనకు మంచి గురి ఉండటంతో దాన్ని మైత్రీ వాళ్లకు చేయాలని ఫిక్స్ అయ్యాడు. అలా ఈ సినిమాకు బేనర్ మారినట్లు తెలుస్తోంది. మరి పాత బాకీలన్నీ ఈ సినిమాతో విజయ్ తీర్చేస్తాడేమో చూడాలి.