ఎన్టీఆర్ 30 అప్‌డేట్.. కొరటాల నోటితో


జూనియర్ ఎన్టీఆర్.. మూడున్నరేళ్లకు పైగా ‘ఆర్ఆర్ఆర్’కే అంకితమైపోయి ఉన్నాడు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయి ఆరు నెలలు దాటినా ఇప్పటిదాకా వేరే సినిమా మొదలు పెట్టలేదు. కొరటాల శివతో తారక్ తర్వాతి సినిమాకు సంబంధించి ప్రకటన వచ్చి ఏడాది దాటిపోయింది. కానీ ఇప్పటిదాకా ఆ సినిమా గురించి కొత్తగా ఏ అప్‌‌డేట్ లేదు. ప్రారంభోత్సవం, రెగ్యులర్ షూట్ ఇదిగో అదిగో అంటున్నారే తప్ప ఎంతకీ అది జరగట్లేదు.

కొరటాల శివ ‘ఆచార్య’ పని ముగించి ఎప్పుడు ఈ సినిమాను మొదలుపెడతాడా అని అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఐతే ఎట్టకేలకు ఈ నెల 29న ‘ఆచార్య’ రిలీజైపోతుండటంతో.. అటు ఇటుగా ఇంకో నెల రోజుల్లో ఎన్లీఆర్ 30 షూటింగ్ మొదలు కావచ్చని వార్తలొస్తున్నాయి. కానీ అప్పుడైనా సినిమా మొదలవుతుందో లేదో అన్న అనుమానంతో ఉన్నారు తారక్ ఫ్యాన్స్. ఇలాంటి డెడ్ లైన్లు చాలానే దాటిపోవడమే వారి సందేహాలకు కారణం.

ఐతే స్వయంగా కొరటాల శివనే ఇప్పుడు తారక్‌తో తాను చేయబోయే సినిమా గురించి అప్‌డేట్ ఇచ్చాడు. జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని ఆయన వెల్లడించారు. తారక్ కోసం తాను మంచి కథ రాసినట్లు ఆయన చెప్పాడు. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని.. సినిమా గురించి తాను ఇప్పుడు ఏమీ మాట్లాడనని ఆయనన్నారు.

‘ఆర్ఆర్ఆర్’తో తారక్ ఇమేజ్ పెరిగింది కాబట్టి దీన్ని పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారా అని అడిగితే.. ‘‘నాకసలు పాన్ ఇండియా అనే పదమే నచ్చదు. ఏ కథ అయినా ఎక్కువమంది చూడాలనే రాస్తాం తప్ప.. తెలుగు ప్రేక్షకుల కోసమైతే ఒకలా.. పాన్ ఇండియా మార్కెట్ కోసమైతే ఇంకోలా అనేదమీ ఉండదు. పెద్ద, బలమైన కథను రాస్తే సహజంగానే అందరూ చూస్తారు. ఎన్టీఆర్ కోసం అలాంటి కథనే రాశా’’ అని కొరటాల అన్నారు. ‘ఆచార్య’ను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారా అంటే అది నిర్మాత చూసుకుంటారని కొరటాల వ్యాఖ్యానించాడు.