అల్లు వారి బ్రాండ్ బద్దల్

టాలీవుడ్లో చాలామంది సీనియ‌ర్ నిర్మాత‌లు సినిమాలు మానేసి ఇళ్ల‌కు ప‌రిమితం అయ్యారు. ఒక‌ప్పుడు వెలుగు వెలిగిన చాలా సంస్థ‌లు ఇప్పుడు ఆఫీసులు మూసేశాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పు చెంద‌లేక‌, అప్‌డేట్ కాలేక దిగ్గ‌జ నిర్మాత‌లు సైలెంటుగా ఉన్నారు. కానీ 40 ఏళ్లకు పైగా సినిమాలు తీస్తూ.. ఇప్ప‌టికీ చాలా యాక్టివ్‌గా ఉన్న నిర్మాత అల్లు అర‌వింద్. ఆయ‌న నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌కు ఎంత మంచి పేరుందో, దాని స‌క్సెస్ రేట్ ఎలాంటిదో తెలిసిందే.

బ‌న్నీ వాసు అనే యువ నిర్మాత‌ను భాగ‌స్వామిని చేసుకుని ట్రెండీగా సినిమాలు తీస్తూ ఇప్ప‌టికీ త‌నకు తానే సాటి అని చాటుతున్నాడు అల్లు అర‌వింద్. చిన్న‌దైనా, పెద్ద‌దైనా అల్లు వారి కాంపౌండ్ నుంచి ఓ సినిమా వ‌స్తోందంటే అందులో విష‌యం ఉంటుంద‌ని, అది స‌క్సెస్ కావ‌డం గ్యారెంటీ అనే న‌మ్మ‌కం అంద‌రిలోనూ ఉంది. ఎప్పుడో కానీ అల్లు వారి సినిమాలు తేడా కొట్ట‌వు. చివ‌ర‌గా అల్లు వారికి త‌గిలిన పెద్ద షాక్ అంటే.. బ‌ద్రీనాథ్‌యే.

ఐతే ఇప్పుడు అల్లు కాంపౌండ్ నుంచి వ‌చ్చిన ఓ సినిమాకు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దారుణ ప‌రాభ‌వం ఎదురైంది. అదే.. వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టించిన గ‌ని. ఈ చిత్రంతోనే అల్లు అర‌వింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ నిర్మాత‌గా ప‌రిచ‌యం అయ్యాడు. ఇన్నాళ్లూ తండ్రి చాటు కొడుగ్గా ఉంటూ, గీతా ఆర్ట్స్ నిర్మాణ వ్య‌వ‌హారాలు చూస్తూ వ‌చ్చిన అల్లు బాబీకి ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో మంచి పేరే ఉంది. తెర‌పై పేరు ప‌డ‌కున్నా.. తెర వెనుక గీతా వారి సినిమాల్లో, అల్లు అర్జున్ కెరీర్ ప్లానింగ్‌లో బాబీ పాత్ర కీల‌కం అంటుంటారు. ఇలాంటి వ్య‌క్తి నిర్మాత‌గా ప‌రిచ‌యం అవుతూ.. గ‌ని సినిమాతో ఇంత పెద్ద షాక్ తిన‌డం అల్లు వారికి జీర్ణించుకోలేని విష‌య‌మే.

రూ.27 కోట్లు షేర్ తెస్తే కానీ బ్రేక్ ఈవెన్ కాని సినిమా.. రూ.3 కోట్ల లోపు షేర్‌కు ప‌రిమితం కావ‌డం అంటే ఎంత పెద్ద డిజాస్ట‌రో అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్పుడు బ‌య్య‌ర్లంద‌రికీ సెటిల్ చేసేస‌రికి అల్లు బాబీ ఎంత న‌ష్ట‌పోతాడో ఏంటో మ‌రి. జ‌డ్జిమెంట్ విష‌యంలో తిరుగులేని పేరున్న అల్లు ఫ్యామిలీకి గ‌ని అలాంటిలాంటి షాక్ కాదు. సినిమాలో కంటెంట్ వీక్‌గా ఉండటానికి తోడు రిలీజ్ టైమింగ్ కూడా ఈ చిత్రాన్ని దెబ్బ తీసినట్లుంది. మరి చాన్నాళ్ల ముందే ఫైనల్ కాపీ రెడీ అయిన నేపథ్యంలో జడ్జిమెంట్ కింగ్‌గా పేరున్న అల్లు అరవింద్ ఏమీ చేయలేకపోయారా.. రిలీజ్ ప్లానింగ్ విషయంలో జాగ్రత్త పడలేకపోయారా అన్నది ప్రశ్న.