ఆషామాషీగా కుదరదు ఆచార్యా

తీసిన నాలుగు సినిమాలతోనూ బ్లాక్‌బస్టర్లు అందుకున్న దర్శకుడు కొరటాలతో మెగాస్టార్ చిరంజీవి సినిమా అనగానే అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఈ చిత్రానికి ‘ఆచార్య’ లాంటి క్రేజీ టైటిల్ పెట్టడం, రామ్ చరణ్‌తో కీలక పాత్ర చేయించడంతో అంచనాలు ఇంకా పెరిగాయి. సినిమా అనుకున్న సమయానికి వచ్చి ఉంటే కథ వేరుగా ఉండేది. కానీ కరోనా, ఇతర కారణాల వల్ల విడుదల మరీ ఆలస్యం కావడం.. మధ్యలో సినిమా అసలు వార్తల్లోనే లేకుండా పోవడం.. రిలీజ్ డేట్లు మళ్లీ మళ్లీ మార్చడంతో సినిమాపై ఉన్న ఆసక్తి తగ్గుతూ వచ్చింది.

ఒక దశలో ‘ఆచార్య’ గురించి అందరూ మరిచిపోయారు కూడా. రిలీజ్ నెలలోకి వచ్చినా కూడా సినిమాకు మామూలుగా ఉండాల్సినంత హైప్ లేదు. కొన్ని వారాలుగా ‘ఆర్ఆర్ఆర్’ గురించే చర్చలు నడుస్తుండగా.. ఇక ‘కేజీఎఫ్: చాప్టర్-2’ మీదికి ఫోకస్ మళ్ల బోతోంది. బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా జోరు తగ్గాక కానీ ‘ఆచార్య’ మీదికి జనాల దృష్టిమళ్లదు.

ఎంతటి క్రేజీ ప్రాజెక్టు అయినా సరే.. మరీ ఆలస్యం అయితే హైప్ తగ్గుతుందనడానికి ‘ఆచార్య’ ఒక రుజువు. ఇది బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి విజువల్ వండర్ అయితే కథ వేరుగా ఉంటుంది. సగటు కమర్షియల్ సినిమానే అయినప్పటికీ ఇంత ఆలస్యం జరగడం అభిమానులను నిరాశకు గురి చేసేదే. ఐతే ప్రస్తుత పరిస్థితుల్లో ‘ఆచార్య’కు తిరిగి మునుపటి హైప్ తీసుకురావడం అంత తేలిక కాదు. అలా జరగాలంటే ట్రైలర్ అదిరిపోవాలి.

ఈ నెల 12న ‘ఆచార్య’ ట్రైలర్‌కు ముహూర్తం కుదిరిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు రిలీజ్ చేసిన రెండు టీజర్ల తరహాలో ట్రైలర్ ఉంటే మాత్రం కష్టమే. అంతకుమించి స్టన్నింగ్‌గా ఏదో ఒక అంశం ఉండాలి. ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయాలి. ఇప్పటిదాకా అయితే కథ పరంగా.. చిరు పాత్ర పరంగా వ్యవహారమంతా రొటీన్‌గానే కనిపిస్తోంది. పాటలు సైతం అంతగా ప్రేక్షకులకు రీచ్ కాలేదు. కాబట్టి ట్రైలర్ కట్ విషయంలో కొరటాల చాలా జాగ్రత్త పడాలి. ప్రేక్షకులను షాక్ గురి చేసేలా దాన్ని తీర్చిదిద్దాలి. అలాగే రిలీజ్ ముంగిట ప్రమోషన్లు హోరెత్తించాలి. జనాల్ని ఊపేసే ఒక పాట పడాలి. అప్పుడే ‘ఆచార్య’కు రావాల్సినంత హైప్ వస్తుంది.