‘ఆదిపురుష్’ దర్శకుడి యటకారం

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ సినిమాల మీద అంచనాలు ఏ స్థాయిలో పెరిగిపోయాయో తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఇండియా అంతటా అతడి సినిమాల కోసం ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారు. కానీ వారి ఆకాంక్షలకు తగ్గట్లు సినిమాలు తీయడం లేదు ప్రభాస్. సినిమాలు అంచనాలకు తగ్గట్లు లేకపోవడం ఒక సమస్య అయితే.. వాటిని ప్రమోట్ చేసే విధానంలోనూ అభిమానులకు నిరాశ తప్పట్లేదు.

మిగతా హీరోల్లాగా పకడ్బందీ పీఆర్ టీంను మెయింటైన్ చేయడం, ఎప్పటికప్పుడు అభిమానులకు అప్ డేట్స్ ఇవ్వడం.. సమయానుకూలంగా ఫస్ట్ లుక్, టీజర్ లాంటి కానుకలు ఇవ్వడం లాంటివి ప్రభాస్ సినిమల విషయంలో జరగట్లేదన్న కంప్లైట్స్ ఉన్నాయి. సాహో, రాధేశ్యామ్ చిత్రాల విషయంలో నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ మీద అభిమానులు ఎంత మండిపడ్డారో.. సోషల్ మీడియాలో వారికి వ్యతిరేకంగా హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ఎలా ట్రోల్ చేశారో తెలిసిందే. చివరికి యువి వాళ్ల ఆఫీసుల ముందు ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది.ఇప్పుడు ప్రభాస్ కొత్త సినిమా ‘ఆదిపురుష్’ టీం కూడా దీనికి భిన్నంగా ఏమీ చేయడం లేదు. ఈ సినిమా మొదలై ఏడాది దాటింది. షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

ఇప్పటిదాకా ఈ చిత్రం నుంచి కనీసం ఫస్ట్ లుక్ రిలీజ్ కాలేదు. సినిమాను అనౌన్స్ చేసిన టైంలో ఒక యానిమేటెడ్ ఫొటో ఏదో రిలీజ్ చేశారు తప్పితే.. రాముడిగా ప్రభాస్ లుక్ మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. గత ఏడాది శ్రీరామనవమికే ఫస్ట్ లుక్ ఆశించి భంగపడ్డారు అభిమానులు. ఏడాది గడిచింది. మళ్లీ శ్రీరామ నవమి వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న సినిమా నుంచి ఫస్ట్ లుక్ లేదా టీజర్ ఆశించడంలో అభిమానుల తప్పేముంది? కానీ ‘ఆదిపురుష్’ టీం ఇలాంటి ప్రయత్నేమీ చేయలేదు.

సరికదా దర్శకుడు ఓం రౌత్ అభిమానులకు చిర్రెత్తుకొచ్చే పని చేశాడు. ప్రభాస్‌ను రాముడిగా చూపిస్తూ అభిమానులు తయారు చేసిన పోస్టర్లతో ఒక షో రీల్ తయారు చేసి దాన్ని షేర్ చేసి అభిమానులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పాడు. ఇంత భారీ చిత్రం నుంచి శ్రీరామనవమి శుభ సందర్భాన ఒక అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేయలేని స్థితిలో ఉండటం దారుణమని, ఫ్యాన్ మేడ్ పోస్టర్లతో విషెస్ చెబుతారా అని అభిమానులు మండిపడుతున్నారు.