అప్పుడు ఇలియానా, తాప్సి.. ఇప్పుడు ఈమె

దక్షిణాది సినిమాల్లో మంచి మంచి అవకాశాలు అందుకుని తమ టైం నడిచినన్నాళ్లు చాలా స్వీట్‌గా మాట్లాడతారు ఉత్తరాది భామలు. కానీ ఇక్కడ ఛాన్సులు తగ్గి, బాలీవుడ్లో అవకాశాలు దక్కగానే వారి స్వరం మారిపోతుంటుంది. సౌత్ సినిమాను తక్కువ చేసి మాట్లాడ్డం వాళ్లకు ఫ్యాషన్ అయిపోతుంటుంది. ఇలియానా, తాప్సి లాంటి వాళ్లు దక్షిణాదిన ఏ అభ్యంతరం లేకుండా గ్లామర్ రోల్స్‌ చేసి, కోట్లు సంపాదించుకుని.. అనుకోకుండా బాలీవుడ్లో అవకాశాలు అందుకున్నాక తెలుగు చిత్రాల గురించి ఎలా మాట్లాడారో గుర్తుండే ఉంటుంది.

ఇక్కడి వాళ్లకు గ్లామర్ మీదే ఫోకస్ అని, తమ టాలెంటును గుర్తించలేదని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. గ్లామర్ రోల్స్ ఇష్టం లేనపుడు వాటిని తిరస్కరించడం వాళ్ల చేతుల్లోనే ఉన్నా.. ఆ పని మాత్రం చేయరు. డబ్బుల కోసం ఏ పాత్ర ఆఫర్ చేస్తే అది చేసి.. ఆ తర్వాత ఇలా మాట మార్చడం విడ్డూరం. ఇప్పుడు రాశి ఖన్నా కూడా వీరి బాటలోనే పయనిస్తున్నట్లు కనిపిస్తోంది.తెలుగులో ఒకప్పుడు వరుసగా అవకాశాలు అందుకున్న రాశికి.. ఇప్పుడు ఛాన్సులు తగ్గిపోయాయి.

ఇలాంటి టైంలో ఆమె చూపులు బాలీవుడ్‌పై పడ్డాయి. అజయ్ దేవగణ్‌లో కలిసి ‘రుద్ర’ అనే వెబ్ సిరీస్‌ చేసిన ఆమె.. షాహిద్ కపూర్ సరసన ఓ సినిమాకు కమిటైంది. ‘రుద్ర’కు మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ.. సౌత్ ఫిలిం మేకర్స్ మైండ్ సెట్ గురించి మాట్లాడింది రాశి.

‘‘దక్షిణాది సినిమాలో గ్లామర్ డాల్, గొప్ప నటి అని విభజించి చూస్తారు. నేను అక్కడ కమర్షియల్ సినిమాల్లో కొన్ని మంచి పాత్రలు చేశాను. కానీ నేను అందంగా ఉన్నానని, పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ పాత్రలకు సరిపోనంటూ కొందరు నాకు ఛాన్సులు ఇవ్వలేదు. అక్కడి వాళ్లు అందాన్ని తప్ప టాలెంటుని చూడరు. నన్ను మంచి నటిగా గుర్తించలేదు. దీంతో ఒకే తరహా పాత్రల్లో నటించాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలో నాలోని నటిని అందరికీ చూపించడానికి ‘రుద్ర’తో మంచి అవకాశం వచ్చింది. ఇకపై నా నుంచి అన్నీ విభిన్నమైన సినిమాలే వచ్చేలా చూసుకుంటా’’ అని రాశి అంది.