పిక్ టాక్: వారసులతో ధనుష్

తమిళంలో పెద్దగా బ్యాగ్రౌండ్ ఏమీ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి కేవలం తన ప్రతిభతో స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు ధనుష్. తొలి సినిమా ‘తుల్లువదో ఎలమై’ (తెలుగులో జూనియర్స్‌గా రీమేక్ చేశారు) ధనుష్ లుక్స్ చూసి ఇతనేం హీరో అని చాలామంది కామెంట్లు చేశారు.

అలా కామెంట్ చేసిన వాళ్లే రెండో చిత్రం ‘కాదల్ కొండేన్’లో ధనుష్ నటనకు ఫిదా అయిపోయారు. ఇతనేం నటుడురా బాబూ అని ఆశ్చర్యపోయారు. అంతలా తన నటనతో ఆశ్చర్యపరిచాడు ధనుష్. ఆ తర్వాత అతను వెనుదిరిగి చూసుకున్నది లేదు. చూస్తుండగానే పెద్ద స్టార్ అయిపోయాడు.

ఇక రజినీకాంత్ కూతురు ఐశ్వర్యను పెళ్లాడాక తన ఫాలోయింగ్ ఇంకా పెరిగింది. ఇంకా పెద్ద స్టార్ అయ్యాడు. తన ప్రతిభకు తోడు ధనుష్ అల్లుడు అనే ట్యాగ్ కూడా స్టార్ ఇమేజ్ పెరగడానికి తోడ్పడింది. హాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ ఇప్పుడు స్థాయిని మరింతగా పెంచుకున్నాడు.

ఇలా అంతా సాఫీగా సాగిపోతున్న టైంలో కొన్ని నెలల కిందట ఐశ్వర్య నుంచి విడిపోతున్నట్లు ధనుష్ ప్రకటించడం సంచలనం రేపింది. ఇరు కుటుంబాల మధ్య రాజీ చర్చలు కూడా ఫలించలేదు. ధనుష్, ఐశ్వర్య విడిపోవడం పక్కా అని తేలిపోయింది. ఇలాంటి టైంలో ధనుష్ తన ఇద్దరు కొడుకులను తీసుకుని ఒక వేడుకలో పాల్గొనడం ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించాడు.

ఇళయరాజా తనయుడు, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా మ్యూజికల్ కన్సర్ట్‌కు ధనుష్ అతిథిగా హాజరయ్యాడు. ఈ వేడుకకు అతడి కొడుకులు యాత్ర రాజా, లింగ రాజా కూడా హాజరయ్యారు. పెద్ద కొడుకైతే ధనుష్ అంత పొడవు వచ్చేయడం, త్వరలోనే హీరోగా లాంచ్ కావడమే ఆలస్యం అన్నట్లుగా కనిపించడం విశేషం.

అతను చూడ్డానికి ధనుష్ లాగే కనిపిస్తున్నాడ కూడా. భార్య నుంచి విడిపోయిన టైంలో ఇలా ఇద్దరు కొడుకులను వెంట బెట్టుకుని ఈ వేడుకకు రావడంతో తాను ఇప్పటికీ ఫ్యామిలీ మ్యాన్ అనే చెప్పడానికి ప్రయత్నించినట్లుగా కనిపిస్తోంది. మరి తల్లిదండ్రులకు విడాకులయ్యాక కొడుకులిద్దరూ తండ్రి దగ్గరే ఉంటున్నారో ఏమో తెలియదు మరి. ఏదేమైనాప్పటికీ లైమ్ లైట్‌కు దూరంగా ఉండే ధనుష్ కొడుకులు.. ఇలా తండ్రితో కలిసి మ్యూజికల్ కన్సర్ట్‌లో పాల్గొనడంతో అందరి దృష్టీ వారిపై పడింది.