ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రానక్కర్లేదా?

ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల రేట్లు అమాంతం తగ్గించేయడంతో టాలీవుడ్ జనాలు ఎంతగా ఇబ్బంది పడ్డారో తెలిసిందే. అక్కడ నిర్దేశించిన రేట్లు ప్రేక్షకులకే అన్యాయంగా అనిపించాయి. దాదాపు ఏడాది పాటు ఇండస్ట్రీని సతాయించాక ఈ మధ్యే ప్రభుత్వం రేట్లు సవరించింది. సాధారణ రేట్లు అయితే ఇండస్ట్రీ జనాలు కోరుకున్న స్థాయిలో లేవు. అయినా సరే.. ఈ రేట్లు చాలా సంతృప్తికరం అంటూ స్టేట్మెంట్లు ఇచ్చారు.

కానీ తెలంగాణలో ప్రభుత్వం తాము అడిగిందల్లా ఇచ్చేస్తుండటంతో అత్యాశకు పోతున్నారు నిర్మాతలు. ఇప్పటికే సాధారణ స్థాయిలో పెంచిన రేట్లు ప్రేక్షకులకు భారంగా మారాయి. సింగిల్ స్క్రీన్లలో రూ.150, మల్టీప్లెక్సుల్లో రూ.200గా మారింది కనీస ధర. ఆ భారం చాలదన్నట్లు పెద్ద సినిమాలకు రెండు వారాలు అదనంగా రేట్లు పెంచుకునే సౌలభ్యమూ పొందుతున్నారు. దీంతో సింగిల్ స్క్రీన్లో రూ.200, మల్టీప్లెక్సుల్లో రూ.250కి కనీస ధర పెరిగిపోయింది.

మెజారిటీ మల్టీప్లెక్సుల్లో టికెట్ ధర రూ.295కు పెరిగిపోయింది. దానికి ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జీలు కూడా కలిపితే రేటు రూ.330 దాకా అవుతుండటం గమనార్హం. ఒక్కో టికెట్‌కు ఇంత పెట్టి ఫ్యామిలీని తీసుకుని థియేటరుకు వెళ్లి సినిమా చూడాలంటే మధ్య తరగతి జనాలకు ఎంత భారమన్న ఎవరూ ఆలోచించడం లేదు. ఈ రేటే ఎక్కువ అంటే.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు దీని మీద అదనంగా రేట్లు పెంచేస్తున్నారు. దీని ప్రకారం ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జీలతో కలిపి సింగిల్ స్క్రీన్లలోనే రేటు రూ.250 అవుతోంది. మల్టీప్లెక్సుల ధర రూ.350కి చేరుకుంది. ఎంత భారీ చిత్రం అయినా సరే.. ఈ స్థాయికి రేట్లు పెంచేయడం ఎంత వరకు సమంజసం?

దక్షిణాది రాష్ట్రాలన్నింట్లో ఇప్పుడు తెలంగాణలోనే అత్యధిక టికెట్లు రేట్లు ఉన్నాయి. ఆల్రెడీ పరిస్థితి ఇలా ఉంటే.. పెద్ద సినిమా, తొలి వారం డిమాండును దృష్టిలో ఉంచుకుని ఇలా మరింతగారేట్లు పెంచేయడం  విడ్డూరం. ఆల్రెడీ కరోనా, ఓటీటీ వంటి కారణాలతో థియేటర్లకు వచ్చి సినిమాలు చూడటం ఫ్యామిలీ ఆడియన్స్ తగ్గించేశారు. సినిమాలకు రిపీట్ ఆడియన్స్ కూడా బాగా తగ్గిపోయారు. అందుకే వీకెండ్ అవ్వగానే ఎంత పెద్ద సినిమా అయినా చల్లబడిపోతోంది. చూస్తుంటే అత్యాశతో బంగారు గుడ్లు పెట్టే బాతును కోసేసిన చందంగా ఈ వ్యవహారం తయారయ్యేట్లే ఉంది.