టీజర్ టాక్: 35 వేల అడుగుల ఎత్తులో రహస్యం 

కరోనా దెబ్బ నుంచి బాలీవుడ్ ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటోంది. గత ఏడాది దీపావళి టైంలో రిలీజైన ‘సూర్యవంశీ’ బాలీవుడ్లో మళ్లీ ఆశలు రేకెత్తించగా.. గత నెలలో రిలీజైన ‘గంగూబాయి కతియావాడీ’ బాక్సాఫీస్‌లో జోష్ నింపింది. ఇప్పుడు ‘ది కశ్మీర్ ఫైల్స్’ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు రేపుతోంది. చిన్న సినిమాగా రిలీజై పెద్ద రేంజికి వెళ్లేలా కనిపిస్తోంది. ఈ ఊపులో వరుసగా సినిమాలు దించబోతున్నారు బాలీవుడ్ నిర్మాతలు.

త్వరలో విడుదల కానున్న చిత్రాల్లో భారీ అంచనాలున్న వాటిలో ‘రన్ వే 34’ ఒకటి. అజయ్ దేవగణ్, అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో అజయే నిర్మించడం విశేషం. ముందు ‘మే డే’ అనే టైటిల్‌తో మొదలై, ఆ తర్వాత ‘రన్ వే 34’గా దీని పేరు మార్చారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. రంజాన్ కానుకగా ఏప్రిల్ 29న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా సల్మాన్ ఖాన్ చేతుల మీదుగా టీజర్ లాంచ్ చేయించారు. ఇది ఒక ఎయిర్ థ్రిల్లర్ కావడం విశేషం. భూమికి 35 వేల అడుగుల ఎత్తులో నడిచే కథ ఇది. భూమి నుంచి సిగ్నల్స్ తెగిపోయి ఒక విమానం ప్రమాదంలో పడ్డ స్థితిలో దాని పైలట్లయిన అజయ్, రకుల్ ఏం చేశారన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. టీజర్లో కథ పెద్దగా చెప్పకుండా ఇదొక ఎయిర్ థ్రిల్లర్ అనే విషయాన్ని మాత్రం చెప్పారు.

సినిమా అంతా మిస్టీరియస్‌గా, థ్రిల్లింగ్‌గా సాగుతుందని అర్థమవుతోంది. ఈ నెల 21న ‘రన్ వే 34’ ట్రైలర్ లంచ్ చేయబోతున్నారు. అందులో కథ గురించి మరింత వివరంగా చెప్పే అవకాశముంది. ఈ టీజర్‌ను లాంచ్ చేస్తూ సల్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మామూలుగా సల్మాన్ సినిమాలు రంజాన్ కానుకగా రిలీజవుతుంటాయి. ఈసారి ఈద్‌కు తన సినిమా ఏదీ రెడీ కావట్లేదని, ఈసారి అజయ్ సినిమాతో పండుగను సెలబ్రేట్ చేసుకోబోతున్నానని సల్మాన్ వ్యాఖ్యానించాడు.