ముగ్గురు పిల్లల హీరోయిన్.. మూడో పెళ్లి

‘దేవి’ సినిమాలో అమాయకమైన అమ్మాయిగా కనిపించిన వనితకు నిజ జీవితంలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆమె సీనియర్ నటుడు విజయ్ కుమార్, దివంగత నటి మంజులల కూతురన్న సంగతి తెలిసిందే. సినిమాలు తక్కువే చేసినప్పటికీ వ్యక్తిగత జీవితం, వివాదాలతో వనిత తరచుగా వార్తల్లో నిలుస్తుంటుంది.

కొన్నేళ్ల కిందట మీడియాను వెంటబెట్టుకుని తండ్రి ఇంటికి వెళ్లి ఆస్తి విషయంలో గొడవకు దిగిన వైనం తమిళనాట సంచలనం రేపింది. ఇక గత సీజన్లో ‘బిగ్ బాస్’ షోలోనూ ఆమె చాలా హంగామానే చేసింది.

వనిత ఇప్పటికే రెండుసార్లు పెళ్లి చేసుకుంది. ముందుగా 2000వ సంవత్సరంలో టీవీ నటుడు ఆకాశ్‌తో ఆమెకు పెళ్లి జరిగింది. ఏడేళ్ల వైవాహిక జీవితం తర్వాత వాళ్లిద్దరూ విడిపోయారు. తర్వాత అదే ఏడాది ఆమె వ్యాపారవేత్త ఆనంద్ జై రంజన్‌ను పెళ్లాడింది. కానీ అతడి నుంచి ఐదేళ్లకే విడాకులు తీసుకుంది.

రెండు పెళ్లిళ్ల ద్వారా ముగ్గురు పిల్లల్ని కన్న వనిత.. ఇప్పుడు మూడో పెళ్లికి సిద్ధమవడం విశేషం. ఆ ముగ్గురు పిల్లల అనుమతితోనే తాను పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించింది వనిత.

లాక్ డౌన్ టైంలో ఆమె పీటర్ అనే ఫిలిం మేకర్‌తో ప్రేమలో పడింది. వనిత నడిపే యూట్యూబ్ ఛానెల్‌కు సాంకేతిక సహకారం అందించే క్రమంలో పీటర్‌ ఆమెకు చేరువయ్యాడు. ఇద్దరి అభిరుచులు కలిశాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇద్దరూ పెళ్లికి కూడా సిద్ధమైపోయారు. ఈ నెల 27నే సింపుల్‌గా, ప్రభుత్వ నిబంధనల్ని అనుసరించి వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు.

తండ్రి విజయ్ కుమార్‌తో పాటు తోబుట్టువులతో కూడా వనితకు ఆస్తి తగాదాలున్నాయి. ఈ నేపథ్యంలో వారికి వనిత దూరంగా ఉంటోంది. ఆమె పెళ్లికి కూడా వాళ్లెవ్వరూ హాజరు కాకపోవచ్చనే అంటున్నారు. మరి మూడో వివాహంతో అయినా వనితకు ప్రశాంతత వస్తుందేమో చూడాలి.