‘రాధేశ్యామ్’కు నో చెబుదామనుకుని..

‘బాహుబలి’తో ఇండియాలో ఏ హీరోకే లేనంత మాస్ ఇమేజ్ వచ్చింది ప్రభాస్‌కు. ఆ ఇమేజ్‌కు సరితూగే కథలు ఎంచుకుని పకడ్బందీగా సినిమాలు తీయడం ఇప్పుడు దర్శకులకు సవాలుగా మారింది. ‘సాహో’లో ఎంత ఎలివేషన్లు, యాక్షన్ నింపినా కూడా అది ప్రేక్షకులకు రుచించలేదు. అలాంటిది యాక్షన్ పూర్తిగా పక్కన పెట్టి పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రాన్ని ప్రభాస్ చేస్తే అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న భయాలు కచ్చితంగా అందరికీ ఉంటాయి.

నిజానికి ఈ ఊహ కూడా అభిమానులకు ఉండి ఉండదు. కానీ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ రూపంలో ప్రేమకథతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇది పక్కా లవ్ స్టోరీ.. పైగా ఇందులో హీరోలు జ్యోతిష్య నిపుణుడి పాత్రను చేయడం ఇంకా చిత్రం. నిజానికి ఈ పాయింట్ విని ప్రభాస్ అసలు ఈ సినిమానే చేయొద్దని అనుకున్నాడట.

బేసిగ్గా ప్రభాస్‌కు జ్యోతిష్యం మీద నమ్మకాలు లేవట. దీంతో హీరో జ్యోతిష్యుడు అనేసరికి ఈ సినిమా చేయొద్దని భావించాడట. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ కథ చెప్పడం మొదలుపెట్టాక మధ్యలో ‘నో’ చెప్పేద్దామని ప్రభాస్ అనుకున్నాడట. కానీ కథ వినడం మొదలుపెట్టాక ఎక్కడా ఆపబుద్ధి కాలేదని.. చాలా ఆసక్తికరంగా అనిపించి మొత్తం విన్నానని, సినిమా చేయడానికి సిద్ధపడ్డానని ప్రభాస్ తెలిపాడు.

ఇక ‘రాధేశ్యామ్’లో ఫైట్ల గురించి ఆశలేమీ పెట్టుకోవద్దని ప్రభాస్ ముందే అభిమానులకు స్పష్టం చేశాడు. సినిమాలో ఒక్క ఫైట్ కూడా ఉండదని తేల్చేశాడు. కానీ యాక్షన్ మాత్రం ఉంటుందని.. అదేంటన్నది తెర మీదే చూడాలని చెప్పాడు. సినిమాలో హైలైట్లుగా చెప్పుకోదగ్గ అంశాలు చాలా ఉన్నాయని.. ముఖ్యంగా 13 నిమిషాల పాటు సాగే పతాక సన్నివేశం గొప్పగా ఉంటుందని.. ఈ ఒక్క సన్నివేశం కోసం దర్శకుడు రాధాకృష్ణ రెండేళ్లు కష్టపడ్డాడని, తన కెరీర్లో తీసుకున్న అతి పెద్ద రిస్క్ ఈ సినిమానే అని ప్రభాస్ చెప్పాడు.